రాయపోల్, అక్టోబర్ 11 : రాయపోల్ మండలంలోని వడ్డ్డెపల్లిలోని పల్లె ప్రకృతి వనం బృందావనాన్ని తలపిస్తున్నది. ఏపుగా పెరిగిన పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలు ఆహ్లాదం పంచుతున్నాయి. ప్రతి రోజూ సాయంత్రం వేళలో గ్రామస్తులు అక్కడికి వెళ్లి కొద్దిసేపు సేదతీరుతున్నారు. సర్పంచ్ బచ్చు చంద్ర శేఖర్ ప్రత్యేక చొరవతో గ్రామంలో పడావు ఉన్న ఎకరా స్థలంలో పాడుబడ్డ బావిని పూడ్చివేసి దానిని పల్లెప్రకృతి వనం కోసం కేటాయించారు. వివిధ రకాల మొక్కలను నాటి పార్కును తలపించే విధంగా ప్రకృతి వనాన్ని అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్లు, అక్కడక్కడా కూర్చోవడానికి సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేయించారు. రూ.6లక్షల 80వేల అంచనా వ్యయంతో పార్క్ను చేపట్టారు. ఇందులో గ్రామ పంచాయతీ నుంచి రూ.3లక్షల 50వేలతో 1190 వివిధ రకాల మొక్కలు నాటారు. 20 రకాల మొక్కలను నాటడడంతో ప్రకృతివనం మండలంలోనే ఆదర్శంగా నిలిచింది. ప్రభుత్వం పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేయడం సంతోషకరమని, సీఎం కేసీఆర్ ప్రకటించిన హరితనిధికి తాము సంపూర్ణ మద్దతిస్తున్నామని గ్రామస్తులు తెలుపుతున్నారు.
చిత్తశుద్ధితో పనులు చేశాం..
చాలెంజ్గా తీసుకొని గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని అందంగా తీర్చిదిద్దాం. సుమారు ఎకరా స్థలంలో వివిధ రకాల మొక్కలు నాటాం. కూర్చోవడానికి సిమెంట్ బెంచీలు, వాకింగ్ ట్రాకులు ఏర్పాటు చేశాం. పల్లె ప్రకృతి వనాన్ని గ్రామస్తులు, పిల్లలు సద్వినియోగం చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన హరితనిధికి పూర్తి సహకారం అందిస్తాం.
– బచ్చు చంద్రశేఖర్ సర్పంచ్ వడ్డెపల్లి