సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 11: “థింక్ బిగ్, ప్లాన్ బిగ్, డూ బిగ్ అనే సిద్ధాంతంతో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు మార్గదర్శనంలో జిల్లా ఏర్పాటైన ఐదేండ్లలో దేశానికే ఆదర్శంగా సిద్దిపేటను నిలిపాం.” అని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో సిద్దిపేట జిల్లా ఆవిర్భవించి ఐదేండ్లు పూర్తయిన సందర్భంగా అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రాధాన్య కార్యక్రమాలు, పథకాలను ప్రభావవంతంగా అమలు చేసి ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలను సమష్టి కృషితో సాధించగలిగామన్నారు. మిషన్ మోడ్లో భూసేకరణ, ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని, దేశంలోనే 718 జిల్లాల్లో ఎక్కడా లేనివిధంగా కొత్త భూసేకరణ చట్టంతో భూసేకరణ చేసి ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. ఇందుకు సహకరించిన స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా నిర్వాసిత రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
జీహెచ్ఎంసీ తరువాత సిద్దిపేటనే నెంబర్ వన్..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ కార్యక్రమంలో అత్యధిక ఇండ్ల నిర్మాణం చేపట్టిన జిల్లాలో సిద్దిపేట జిల్లా జీహెచ్ఎంసీ తరువాత నంబర్ వన్గా నిలిచిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని 278 గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం జరిగిందన్నారు. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక పట్టణాల్లో ప్రభుత్వ సౌజన్య ఉచిత ఇండ్ల నిర్మాణం, కాంట్రిబ్యూషన్ హౌసింగ్ నిర్మాణంలో అన్ని హంగులు, సౌకర్యాలతో ల్యాండ్ మార్క్ అభివృద్ధి సాధించామని కలెక్టర్ తెలిపారు. స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణం కార్యక్రమంలో సిద్దిపేట జిల్లాలో వీ ప్లాన్డ్ బెటర్, వీ డిడ్ బెటర్ అనే నినాదంతో పకడ్బందీ కార్యచరణతో 40 రోజుల్లోనే 24 వేల మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టిగలిగామని కలెక్టర్ తెలిపారు.
ఐఏఎస్, ఐపీఎస్ల అధ్యయన కేంద్రంగా సిద్దిపేట..
సిద్దిపేట జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అటవీ పునరుద్ధరణ కార్యక్రమాల అధ్యయనానికి కేంద్ర బిందువుగా నిలిచాయన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు, సీనియర్ అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సహా అందరు ఐఏఎస్లు, ఐపీఎస్లు అటవీ పునరుద్ధరణ అభివృద్ధి కార్యక్రమాల క్షేత్ర అధ్యయనానికి రావడం 50 ఏండ్లలో అదే తొలిసారి అని కలెక్టర్ పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ధన్యవాదాలు..
నూతనంగా ఏర్పడిన సిద్దిపేట జిల్లాలో ఐదేండ్ల పాటు పని చేసే అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. జిల్లా టీంను ఎంపిక చేసుకునే స్వేచ్ఛను సైతం తనకు ఇచ్చారన్నారు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు క్షేత్రస్థాయిలో ప్రభుత్వం నిర్దేశిత లక్ష్యాల సాధనలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, శిక్షణ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి బి.చెన్నయ్య, డీఎఫ్వో శ్రీధర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.