చేర్యాల, మే 18 : సిద్దిపేటలో జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి ఆలయంలో రాష్ట్ర దేవాదాయశాఖ ఆదేశాల మేరకు ఆలయ వర్గాలు మెన్ కౌంటింగ్ మిషన్ను ఏర్పాటు చేశారు. మల్లన్న దర్శనానికి రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతున్నది. అదేస్థాయిలో భక్తులకు వసతులు కల్పించడంతో పాటు ఆలయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఆలయ వర్గాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భక్తుల వసతులను పర్యవేక్షిస్తున్న అధికారులకు, ఇక మెన్ కౌంటింగ్ మిషన్ ఎంతగానో ఉపయోగపడనున్నది. స్వామివారి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్యను నిత్యం తెలుసుకునేందుకు సర్కారు ఆదేశాల మేరకు ప్రముఖ ఆలయాల్లో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం, కొండగట్టు ఆంజనేయస్వామి, భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం, సికింద్రాబాద్లోని గణపతి దేవాలయం, బాసర జ్ఞాన సరస్వతీ ఆలయాల్లో ఈ నెలలో మెన్ కౌంటింగ్ మిషన్లను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.
ఎప్పటికప్పుడు డిస్ప్లే కానున్న భక్తుల సంఖ్య..
మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలతో పాటు ప్రతి ఆదివారం భక్తులు వేలసంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో అసలు ఎంతమంది భక్తులు వచ్చారు, మొక్కులు, దర్శనాలు తదితర వాటి లెక్కలు పక్కాగా తెలియని పరిస్థితి ఉంది. స్వామివారి ఆర్జిత సేవల్లో భాగమైన గదుల కిరాయిలు తీసుకున్న వారు, ప్రసాదాల కొనుగోలు, పట్నం టికెట్ల కొనుగోలు, నిత్య కల్యాణ టికెట్ల తదితర వాటిని బేరీజు వేసుకొని స్వామివారిని గింతమంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించే వారు. ఇక నుంచి అలాం టి ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకొని వెళ్లిపోయే ఎగ్జిట్ గేట్ వద్ద మెన్ కౌంటింగ్ మిషన్ ఏర్పాటు చేశారు. స్వామివారి ఆలయం నుంచి వెళ్తున్న వారిని ఆ మిషన్ ఎప్పటికప్పుడు గుర్తిస్తూ లెక్కలు వేసి డిస్ప్లే చేస్తున్నది. ఆలయంలో ఏర్పాటు చేసిన మెన్ కౌంటింగ్ మిషన్ హైదరాబాద్లోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేశారు. దీంతో రాష్ట్రస్థాయి అధికారులు సైతం రాష్ట్రంలోని ప్రధాన ఆలయా ల్లో నిత్యం ఎంతమంది వచ్చి మొక్కులు చెల్లించుకున్నారనే విషయాన్ని తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.