సిద్దిపేట అర్బన్, జూలై 18 : ప్రజావాణి ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజల నుంచి జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) శ్రీనివాస్రెడ్డితో కలిసి ప్రజా వినతులు, ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు. ఈ మేరకు ప్రజావాణికి 44 దరఖాస్తులు వచ్చాయి.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి నుంచి అర్జీలు తీసుకోవడమే కాకుండా వాటి పరిష్కారాలను శుక్రవారం లోపు తెలియజేయాలన్నారు.
అధికారులు అందరూ విధిగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి తప్పక హాజరు కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చెన్నయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.