రామాయంపేట, ఫిబ్రవరి 18: పేద కుటుంబాలకు రంజన్లు, మట్టి కుండలే ఫ్రిజ్లుగా మారాయి. ఎండలు కొడుతూండడంతో మట్టికుండలు, రంజన్లకు గిరాకీ పెరిగింది. పొద్దంతా ఎండలు మండడంతో చల్లటి నీటిని తాగేందుకు కుండలు, రంజన్లను ఇప్పటి నుంచే వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. మెదక్ జిల్లాలోని తూప్రాన్, రామాయంపేట, చేగుంట, నార్సింగి, నిజాంపేట, మనోహరాబాద్ తదితర మండలాల్లో విరివిగా రంజన్లు, మట్టికుండలను విక్రయిస్తున్నారు. ఎక్కువ శాతం మట్టికుండలు, రంజన్లలోని నీళ్లు తాగడానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. మార్చిలో ఎండలు దంచి కొట్టేవి, ప్రస్తుతం ఫిబ్రవరి ప్రారంభం నుంచే ఎండలు మండిపోతున్నాయి. రాత్రంతా చల్లగా ఉన్నా పొద్దంతా వేడితో జనాలు విలవిలలాడుతున్నారు. రామాయంపేట మండ ల కేంద్రంలో కుండల దుకాణాల్లో వారం నుంచి విక్రయాలు జోరందుకున్నాయి. ఒక్కో రంజన్ రూ.100 నుంచి రూ 250 వరకు ధర పలుకుతున్నది. రంజన్లకు నల్లాలు బిగించి విక్రయిస్తున్నారు. రజన్లకు నల్లా బిగిస్తే మరో రూ.50 అదనంగా తీసుకుంటున్నారు.
ఈసారి ముందే ఎక్కువగా ఎండ లు ఉన్నందున రజన్ల గిరాకీ బాగానే ఉన్నది. రామాయంపేట చుట్టుపక్కల మండలాల వారు కూడా ఇక్కడ నుంచే రంజన్లు కొనుగోలు చేస్తున్నారు. కొంత డబ్బు తీసుకుని రంజన్లకు నల్లా బిగించి ఇస్తున్నా. ఇప్పటివరకైతే ఈ వ్యాపారం మంచిగా నడుస్తున్నది.