సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 3: కంటి వెలుగు శిబిరాల వద్ద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని మున్సిపల్, వైద్య సిబ్బందిని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశించారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని 43వ వార్డు బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డితో కలిసి మంత్రి పరిశీలించారు. కంటి వెలుగు కార్యక్రమం ఎలా ఉందని లబ్ధిదారులను అడుగగా, ఎంతో ఉపయోగకరంగా ఉందని వారు చెప్పారు. ఎంతమందికి పరీక్షలు నిర్వహించారు? ఎంత మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారనే విషయాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ కండ్ల అద్దాలు అవసరమున్న వారికి తక్షణమే రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రిస్క్రిప్షన్ అద్దారులు అవసరం ఉన్న వారికి యాప్లో నమోదు చేస్తే 15 రోజుల్లోగా లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. మంత్రివెంట జిల్లా వైద్యాధికారి డాక్టర్ కాశీనాథ్, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీందర్రెడ్డి, వైద్య బృందం ఉన్నారు.