దుబ్బాక టౌన్, అక్టోబర్ 11 : ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రజలు సేవాభావాన్ని అలవర్చుకోవాలని ఎమ్మెల్సీ ఫారూఖ్హుస్సేన్ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక బాలాజీ ఫంక్షన్హాల్లో కేదారీనాథ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరుపేదలకు దసరా పండుగ సందర్భంగా బట్టలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేదలకు సేవ చేయడంలోనే ఎంతో తృప్తి ఉందన్నారు. సీఎం కేసీఆర్ బతుకమ్మ పండుగగకు ప్రతి యేడు రాష్ట్రంలోని ఆడపడుచులందరికీ చీరలను అందించడం గొప్ప విషయమన్నారు. సీఎం దూరదృష్టితోనే వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి చెందిందని గ్రామాల్లో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయన్నారు.
బీడు భూములు వ్యవసాయ భూములుగా మారి నేడు దేశంలోనే వరి పండించడంలో అగ్రగామిగా తెలంగాణ నిలిచిందన్నారు. కరెంట్, నీళ్లు, పెన్షన్లకు కొదవేలేదని ప్రతి ఒక్కరికి చేతినిండా పని ఉండటంతో వలసలు పూర్తిగా తగ్గాయని ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ అన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితభూంరెడ్డి, కౌన్సిలర్లు కల్పన, బట్టు యాదమ్మ, కూరపాటి బంగారయ్య, ఇల్లందుల శ్రీనివాస్, నాయకులు రొట్టె రాజమౌళి, పులిగారి ఎల్లం, మూర్తి శ్రీనివాస్రెడ్డి, గుండబోయిన వెంకటేశ్వర్లు, కేదారీనాథ్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మధుసూదన్, కాశీనాథ్ తదితరులు ఉన్నారు.