మద్దూరు(ధూళిమిట్ట), జనవరి 3: పేద విద్యార్థులకు పౌష్టకాహారాన్ని అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం సంక్షేమ వసతిగృహాల్లో కోడిగుడ్లు, చికెన్, మటన్ను అందిస్తున్నది. అధికారులు, కాంట్రాక్టర్ల చర్యలతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతున్నది. సిద్దిపేట జిల్లా మద్దూరు మోడల్ స్కూల్కు చెందిన బాలికల హాస్టల్లో 49మంది విద్యార్థినులున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారం సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో కోడిగుడ్లు అందించాలి. 1, 3, 5వ ఆదివారాల్లో చికెన్, 2, 4 ఆదివారాల్లో మటన్ అందించాలి. ఈ హాస్టల్లో నెల రోజులుగా విద్యార్థులకు కోడిగుడ్లు అందడం లేదు. చికెన్, మటన్ కూడా అందించడం లేదు.
జిల్లాలోని అన్ని హాస్టళ్లకు కోడిగుడ్లు సరఫరా చేసే హక్కులను దక్కించుకున్న చేర్యాలకు చెందిన ఓ కాంట్రాక్టర్ ఇటీవల కోడిగుడ్ల ధరలు పెరుగుతుండడంతో తనకు గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో హాస్టల్కు కోడిగుడ్ల సరఫరాను నిలిపివేశాడు. నవంబర్ 28వరకు మాత్రమే సరఫరా చేశాడు. హాస్టల్ వార్డెన్ జ్యోతి కోడిగుడ్లను ఎందుకు పంపించడం లేదని ప్రశ్నించినప్పటికీ కాంట్రాక్టర్ తనకేం పట్టదన్నట్లు వ్యవహరించాడు. దీంతో స్వయంగా వార్డెన్ డిసెంబర్లో తన మోపెడ్పై వెళ్లి 5 ట్రేలలో గుడ్లు తీసుకువచ్చి మూడు రోజులపాటు అందించారు. ఈ విషయాన్ని వార్డెన్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. దీంతో విద్యార్థులు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. మారుమూలన ఉన్న ఈ హాస్టల్లో ఏంజరిగినా ఎవరూ పట్టించుకోరనే ధీమా, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై హాస్టల్ వార్డెన్ జ్యోతిని ‘నమస్తే తెలంగాణ’ ఫోన్లో వివరణ కోరగా నెల నుంచి గుడ్లు అందడం లేదని తెలిపారు. కాంట్రాక్టర్కు ఎన్నిసార్లు చెప్పినా సరఫరా చేయడం లేదని వాపోయారు.