తొగుట: మహిళల సాధికారతే లక్ష్యంగా అన్ని రంగాల్లో మహిళలు మరింత ముందుకు సాగేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని వెంకట్రావుపేట, చందాపూర్ గ్రామాల్లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి మహిళా సమైక్య భవనాలకు శంకుస్థాపన చేశారు. భవిష్యత్తు మహిళలదేనని, వారి అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
అనంతరం వెంకట్రావుపేట నిమ్మతోటలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, కేంద్రాన్ని పరిశుభ్రంగా నిర్వహిస్తూ ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన అంగన్వాడీ టీచర్ వీణను అభినందించి సన్మానించారు. అలాగే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ అభిమాని బొగ్గుల పోచమ్మను ఆప్యాయంగా పలకరించి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేని, బక్కి వెంకటయ్యలను సర్పంచ్ లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నర్సింహారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ కే. హరికృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.