మద్దూరు(ధూళిమిట్ట), ఏప్రిల్29 : కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మద్దూరు గ్రామానికి చెందిన చిలువేరు యాదగిరి(55) అనే వ్యక్తి గత కొన్నేండ్లుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు.
ఈ క్రమంలో యాదగిరి మధ్యాహ్నం సమయంలో తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగుల తాగాడు. రాత్రి అయినా యాదగిరి ఇంటికి రాకవడంతో యాదగిరి కొడుకు రాజు తన స్నేహితుడైన సంతోశ్ను తీసుకొని బావి వద్దకు వెళ్లి చూడగా మంచంలో అపస్మారక స్థితిలో ఉన్న యాదగిరిని బైక్పై చేర్యాల సర్కారు దవాఖానకు తీసుకెళ్లారు. యాదగిరిని పరిశీలించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధృవీకరించారు. మృతుని కుమారుడు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.