సిద్దిపేట టౌన్, అక్టోబర్ 18 : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర స్థాయి వ్యాసరచన, ఫొటోగ్రఫీ పోటీలను నిర్వహించనున్నామని, ఆసక్తి గల విద్యార్థులు, ఫొటోగ్రాఫర్లు ఉత్సాహంగా పాల్గొనాలని సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏడాది మాదిరిగానే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం పోలీసు ప్లాక్ డే సందర్భంగా పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అందులో భాగంగా వ్యాసరచన పోటీలకు 8 నుంచి 10వ తరగతి 1వ కేటగిరి, ఇంటర్మీడియెట్ చదివే విద్యార్థులకు 2వ కేటగిరి, డిగ్రీ చదివే విద్యార్థులకు 3వ కేటగిరిగా నిర్ణయించామన్నారు.
3 కేటగిరిలకు చెందిన విద్యార్థులు భారతదేశ అభివృద్ధిలో పోలీసుల పాత్ర అనే అంశంపై https://forms.gle/HvF8YAGEWVYG3WjA9 లింకు ద్వారా విద్యార్థులు వ్యాసరచన పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. ఈ నెల 24 చివరి తేదీ అని చెప్పారు.
అదే విధంగా ఫొటోగ్రఫీ పోటీలకు కమ్యూనిటీ పోలీసింగ్, అత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన, ప్రకృతి వైపరీత్యాలలో పోలీసు సేవలతో పాటు ఇతర సందర్భాలలో పోలీసుల కీర్తి ప్రతిష్టలు పెంపొందించే అంశాలకు సంబంధించిన గత సంవత్సరం అక్టోబర్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ 28వ తేదీ మధ్య కాలంలో తీసిన ఫోటోలను ఆన్లైన్లో పంపాలని చెప్పారు.
https://forms.gle/uJj58SSN1GQPNjp8A” లింకులో పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తు ఈ నెల 28 వరకు చేసుకోవాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తూ అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహిస్తున్న పోటీలకు విద్యార్థులు, ఔత్సాహికులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.