చేర్యాల, జూన్ 9 : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ చక్కదిద్దుతుంటే ఓర్వలేని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెసోల్లు నిత్యం ప్రభుత్వం పై అసత్య ప్రచారాలు చేయడం పనిగా పెట్టుకున్నారు. వాటిని వెంటనే మానుకోపోతే గులాబీ శ్రేణులు చూస్తూ ఊర్కోవని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హెచ్చరించారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణి, కమిషనర్ రాజేంద్రకుమార్తో కలిసి మున్సిపాలిటీలోని 5వ వార్డులోని బీడీ కాలనీలో విస్తృతంగా పర్యటించారు. పర్యటన సందర్భంగా కాలనీలో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకోవడంతో పాటు డ్రైనేజీలను అక్కడే ఉండి శుభ్రం చేయించారు.
ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు సంబంధిత శాఖ అధికారులను పిలిచి వారి సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని ఒక ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేస్తున్నాడని, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విష, తప్పుడు ప్రచారాలను ప్రజలు పట్టించుకోవద్దన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలను తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నాడని, వాటిని సద్వినియోగం చేసుకొని ప్రజలు అభివృద్ధి చెందాలన్నారు. చేర్యాల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యచరణ రూపొదించి ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ పుర్మ వెంకట్రెడ్డి, కౌన్సిలర్లు ఆడెపు నరేందర్, మంగోలు చంటి, పచ్చిమడ్ల సతీశ్, కోఆప్షన్ సభ్యులు ముస్త్యాల నాగేశ్వర్రావు, జేబాబేగం, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్నర్సయ్య, టీఆర్ఎస్వై నాలుగు మండలాల ఇన్చార్జీ శివగారి అంజయ్య, మహిళ పట్టణ అధ్యక్షురాలు పచ్చిమడ్ల మానస, తదితరులు పాల్గొన్నారు.