దుబ్బాక టౌన్, డిసెంబర్ 16 : డ్రమ్సీడర్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సాగుతో నీటితో పాటు, కూలీల సమస్యను అధిగమించవచ్చని చెబుతున్నారు. సరైన పద్ధతులు పాటించడంతో అధిక దిగుబడి పొంది లాభాలు ఆర్జించవచ్చని సూచిస్తున్నారు. డ్రమ్సీడర్ ఉపయోగిస్తే సాలుకు సాలుకు మధ్య 20సెంటీ మీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 10సెంటీ మీటర్లు దూరం ఉండేట్లు విత్తుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల సాళ్ల మధ్య కలుపుతీసే యంత్రాన్ని నడిపి కలుపును భూమిలోకే కలియదున్ని మంచి ఫలితాన్ని పొందవచ్చు.
పొలం తయారీ: మొదట పొలంలో నీరు బాగా పెట్టి దున్ని నేలను చదును చేయాలి. విత్తనం విత్తే 24 గంటల ముందు పొలంలో నీరు తీసేసి నేలను చిక్కటి బురద పొరగా ఉండేలా చేసుకోవాలి. విత్తనం విత్తేముందు పొలంలో కాగితం పొర మందం నీరు ఉండేలా చూసుకోవాలి. విత్తనాలను 24 గంటల పాటు నీటిలో నానబెట్టాక 24గంటలు మండె కట్టాలి. ముక్కులు పగిలి తెల్లగా మొలక కన్పించగానే విత్తుకోవాలి. తర్వాత మూడు రోజులకు ఒకసారి పొలంలో నీరు పెట్టి తీయాలి. ఈ పద్ధతిని 15 రోజుల పాటు పాటించాలి. ఆ తర్వాత మొలక ఎత్తును బట్టి నీరు పొలంలో తగిన మోతాదులో నిల్వ ఉంచుకోవాలి. ఈ పద్ధతిలో ఎకరానికి 12కిలోల విత్తనాలు సరిపోతాయి.
యంత్రం ఉపయోగించే విధానం: మొలకెత్తిన విత్తనాలను 2/3 వంతు డ్రమ్ములో నింపాలి. డ్రమ్ మూతను మూసివేసి లాక్ చేయాలి. డ్రమ్ సీడర్ను సాధారణంగా మనిషి నడిచే వేగంతో పొలంలో ఒక అంచు నుంచి సమానంగా లాగాలి. డ్రమ్సీడర్ రెండోగాడిని కొలమానంగా నిర్ణయించుకుని రెండోసారి డ్రమ్సీడర్ లాగేటప్పుడు మొదటి చక్రం డ్రమ్సీడర్ గాడిలో నడిపించాలి. తద్వారా సాళ్లు తేడా లేకుండా వస్తాయి. ఇలా పోవడం వల్ల సాలుకు సాలుకు మధ్య 20సెంటీ మీటర్లు ఎడం ఉంటుంది. డ్రమ్సీడర్ రంధ్రాలతో వచ్చే విత్తనాలు సమానంగా పడుతున్నాయో లేదో అప్పుడప్పుడు పరిశీలించుకోవాలి. డ్రమ్ సీడర్లో విత్తన మోతాదు లెవల్ 1/4 వరకు వచ్చినప్పుడు తిరిగి విత్తనాలను నింపాలి.
ప్రయోజనాలు: కూలీల ఖర్చు ఉండదు విత్తనాలు సమానంగా విత్తితే మొక్కల సాంద్రత సమానంగా ఉంటుంది. విత్తన మోతాదు 50శాతం తగ్గుతుంది. పంట 10రోజుల ముందు పక్వతకు వస్తుంది. ఇద్దరు వ్యక్తులు రోజుకు రెండెకరాల్లో విత్తుకోవచ్చు. డ్రమ్సీడర్తో ఖర్చు తక్కువగా రావడంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చు.