రాయపోల్, జూలై 11 : ఎస్ఐఆర్(SIR) సమగ్ర ప్రక్రియలో యువత, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చురుకుగా పాల్గొనాలని.. భావితరాలకు ఓటు హక్కును అందించే బాధ్యత మనందరిపై ఉందని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గుమ్మడి వెన్నెల గద్దర్ అన్నారు. శనివారం రాయపోల్ మండలం తిమ్మక్ పల్లి, రాయపోల్ గ్రామాలలో సర్ ప్రక్రియను దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆమె పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో వెన్నెల మాట్లాడుతూ.. ప్రతి పౌరునికి ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించారని, అర్హులైన వారి ఓట్లు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు.
సర్ ప్రక్రియలో ఎలాంటి తప్పులు లేకుండా బీఎల్ఏలు దగ్గరుండి దరఖాస్తు ఫారాలు నింపి.. బీఎల్ఓలకు అందించేలా చూడాలని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గుమ్మడి వెన్నెల గద్దర్ సూచించారు. గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ నేరుగా అందేటట్లు చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందని ఆమె చెప్పారు.
భారత రాజ్యాంగం దేశ పౌరులందరికీ సమానమైన హక్కులను కల్పించిందని, ముఖ్యంగా మహిళలను చైతన్యం చేయడానికి అనేక హక్కులు కల్పించినప్పటికీ.. మనువాద బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని తొలగించి మహిళలను వంటింటికే పరిమితం చేయాలని చూస్తోందని వెన్నెల మండిపడ్డారు. మనుషులను మనిషిగా చూడని అసమానత రాజ్యాన్ని స్థాపించాలని బీజేపీ చూస్తుందని ఆమె విమర్శించారు.

మనువాదుల కుట్రలను తిప్పి కొట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, ప్రజా యుద్ధనౌక గద్దర్ జీవితాంతం ఆ దిశగా పోరాటం చేశారని గుమ్మడి వెన్నెల గుర్తు చేశారు. సర్ ప్రక్రియను ఈనెల 24 లోపు పూర్తయ్యేలా కాంగ్రెస్ కార్యకర్తలు కృషిచేయాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య, వైస్ చైర్మన్ మద్దెల స్వామి, రాష్ట్ర నాయకులు మద్దుల గాల్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పల్పనూరి ప్రభాకర్ రెడ్డి, పడాల రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి పంచమి గణేష్, మండల అధ్యక్షులు జాల దుర్గాప్రసాద్,మాజీ మండల అధ్యక్షులు తప్పటి సుధాకర్, సర్పంచులు రాజు, అశోక్ రెడ్డి, స్వామి, నాయకులు కిష్టారెడ్డి, పాల రామగౌడ్, కృష్ణ గౌడ్, గుంటి నర్సింలు, పుర్ర నర్సింలు, అనిల్ గౌడ్, కొంగరి దయాకర్,మాజీ ఎంపిటిసి స్వామి, దుర్గాప్రసాద్, స్వామి, నర్సింగరావు, యూసుఫ్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.