హుస్నాబాద్, డిసెంబర్ 16: ఆరుతడి పంటల్లో వేరు శనగ పంట(పల్లి కాయ) ప్రధాన మైనదిగా చెప్పొచ్చు. నూనె గింజల పంటల్లోనూ వేరుశనగకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం పల్లి నూనెకు ఉన్న గిరాకీ అంతా ఇంతా కాదు. మార్కెట్లో పల్లి నూనెకు ఉన్న గిరాకీని దృష్టిలో ఉంచుకొని యాసంగిలో వేరుశనగ పంటను సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయని వ్యవసాయాధికారులు, ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో వేరుశనగ పంటను సాగు చేసుకునేందుకు అనువైన భూములు ఉన్నాయి. ఇసుకతో కలిపి ఉన్న భూములతో పాటు ఎర్రచెల్క భూములు అధికంగా ఉన్నాయి. జిల్లాలో వరి పంటకు ప్రత్యామ్నాయంగా వేరుశనగ పంటను సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆరుతడి పంటలను సాగు చేయాలని ప్రభుత్వాలు సూచిస్తున్న తరుణంలో రైతులు ఈ పంటను సాగు చేసేందుకు ముందుకొస్తున్నారు.
విత్తనాల ఎంపిక… విత్తుకునే విధానం
యాసంగి సీజన్లో వేరుశనగ పంట సాగు కోసం మొదట నాణ్యమైన విత్తన రకాలను రైతులు ఎంచుకోవాలి. ఇందులో రెండు రకాలు విత్తనాలు ఉంటాయి. స్పానిష్ గుర్తి రకాలు, వర్జీనియా గుత్తి రకాలు. స్పానిష్ రకాల్లో కదిరి-6, కదిరి-9, అనంత, కదిరి హరితాంధ్ర, ఐసీజీవీ-91114, ధరణి, టీఏజీ-24రకాల విత్తనాలు ఉన్నాయి. వర్జీనియా రకాల్లో కదిరి-7, కదిరి-8 బోల్ట్ రకాల విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇసుకతో కూడిన గరపనేలలు, నీరు త్వరగా ఇంకిపోయే ఎర్ర చెల్క నేలలు ఈ పంటకు అనువుగా ఉంటాయి. బంకమన్ను, నల్లరేగడి భూములు ఈ పంటకు అనుకూలం కాదు. విత్తుకునే సమయంలో యాసంగి సీజన్ కావడంతో ఒక చదరపు మీటరుకు 44మొక్కలు ఉండేలా చూసుకోవాలి. విత్తనాలను 5సెం.మీటర్ల లోతుకంటే ఎక్కువ లోతులో వేయకూడదు.
ఎరువులు… యాజమాన్య పద్ధతులు
వేరుశనగ పంట వేసే ముందు భూసార పరీక్ష చేయించుకుంటే అందుకు అనుగుణంగా ఎరువులను వాడుకునే అవకాశం ఉంటుంది. దుక్కిలో 3నుంచి 4టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ఎకరానికి 100కిలోల సూపర్ పాస్పేట్, 33కిలోల పొటాష్, 18కిలోల యూరియాను విత్తనాలు వేసే సమయంలోనే వాడాలి. 30రోజుల తర్వాత తొలి పూత దశలో మరో 10నుంచి 15కిలోల యూరియా వేసుకోవాలి. ఊడలు దిగే సమయంలో ఎకరానికి 200కిలోల జిప్సమ్ను మొక్క మొదళ్ల దగ్గర వేసి మట్టితో కప్పాలి. జింక్ లోపంతో ఆకుల చిన్నవిగా మారుతాయి. ఇందుకు ఎకరాకు 400గ్రాముల జింక్సల్ఫేట్ను 200లీటర్ల నీటితో కలిపి వారం రోజుల్లో రెండుసార్లు పంటపై పిచికారీ చేయాలి. ధాతు లోపంతో ఆకులు పసుపు పచ్చగాను, ఆ తర్వాత తెలుపు రంగుకు మారే ప్రమాదం ఉన్నందున ఎకరాకు కిలో అన్నబేది, 200గ్రాముల సెట్రిక్ ఆమ్లం 200లీటర్ల నీటితో కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. కలుపు గడ్డి నివారణ కోసం విత్తనాలు విత్తిన వెంటనే లేదా 48గంటల లోపు అలాక్లోర్ 50శాతం ఇసీ 1.5 నుంచి 2లీటర్ల మందును 200లీటర్ల నీటితో కలిపి దుక్కిపై పిచికారీ చేయాలి.
‘వరి’ కంటే వేరుశనగ పంట సాగే లాభదాయకం…
ఒక ఎకరంలో వరి పంట సాగు చేసేకంటే పల్లిపంటను సాగు చేయడం ఎంతో లాభదాయకం. ఒక ఎకరం పల్లికాయ పంట సాగుచేసేందుకు సుమారు రూ.15వేలు అవుతుంది. ఎకరానికి సగటున 10క్వింటాళ్ల పల్లికాయ పండుతుంది. ప్రభుత్వం క్వింటాల్ పల్లికాయకు రూ.5,550 మద్దతు ధర ఇస్తున్నప్పటికీ ప్రస్తుతం మార్కెట్లో రూ.7వేల నుంచి 9వేల వరకు ధర పలుకుతోంది. సగటున క్వింటాల్ ధర రూ.6,500లు వచ్చినా రైతుకు ఎకరాకు రూ.65వేల ఆదాయం వస్తుంది. పెట్టుబడి పోను రైతుకు ఎకరాకు రూ.50వేలు మిగిలే అవకాశం ఉంది. ఎకరం వరి పంట సాగు చేసేందుకు కనీసం రూ.20వేల పెట్టుబడి అవుతుంది. సగటున ఎకరాకు 26క్వింటాళ్ల వడ్లు పండుతాయి. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం క్వింటాల్కు రూ.1,940లు ఉంది. ఎకరం వరి సాగు చేసిన రైతుకు రూ.50,440ల ఆదాయం వస్తుంది. పెట్టుబడి రూ.20వేలు పోను ఎకరాకు రైతుకు మిగిలేది కేవలం రూ.30,440లు మాత్రమే. ఒక ఎకరం వరి సాగు చేసేందుకు వినియోగించే నీటితో మూడెకరాల వేరుశనగ పంటను సాగు చేసుకోవచ్చు.
తెగుళ్ల నివారణకు చర్యలు
వేరుశనగ పంటకు అనేక రకాల పురుగులు, తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యమైనవి వేరు పురుగు, ఆకు ముడత పురుగు, పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు, తామర పురుగు, పచ్చ దీపపు పురుగు, మొగ్గ తొలుచు పురుగు, తాక్కా ఆకుమచ్చ తెగులు, మొదలు కుళ్లు తెగులు, వేరుకుళ్లు తెగులు, కాండం కుళ్లు తెగులు, మొవ్వ కుళ్లు తెగులు, కుంకుమ తెగులు ఎక్కువగా పంటకు ఆశిస్తాయి. తెగులు లక్షణాలను ఎప్పటికప్పుడు వ్యవసాయాధికారులకు చెప్పినట్లయితే అందుకు తగిన సస్యరక్షణ చర్యలను వివరిస్తారు. అవసరమైతే వ్యవసాయ అధికారులచే క్షేత్ర పర్యటన చేయించడం ద్వారా సస్యరక్షణ చర్యలను తెలుసుకునే అవకాశం ఉంది.
విత్తన రకాలు… వచ్చే దిగుబడులు
విత్తన రకాలను బట్టి పంట దిగుబడులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. కదిరి-6విత్తన రకంతో యాసంగిలో ఎకరాకు 12 నుంచి 14క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కదిరి-9 విత్తనం సాగు చేస్తే ఎకరాకు 10నుంచి 12క్వింటాళ్లు, కదిరి హరితాంధ్ర ద్వారా 10నుంచి 12క్వింటాళ్లు, ధరణి ద్వారా 9నుంచి 10క్వింటాళ్లు, టీఏజీ-24ద్వారా 8నుంచి 10క్వింటాళ్లు, జేఎల్-24ద్వారా 10నుంచి 11క్వింటాళ్లు, ఐసీజీవీ-91114 ద్వారా 10నుంచి 12క్వింటాళ్లు, కదిరి-7,8 ద్వారా 12నుంచి 14క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఇటీవల కొత్తగా వచ్చిన కదిరి లేపాక్షి-1812 రకం విత్తనంతో ఎకరానికి 15నుంచి 18క్వింటాళ్ల దిగుబడి కూడా వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కొత్తరకం విత్తనంతో దిగుబడులు పెరిగాయి
రాయలసీమ ప్రాంతం నుంచి ఇటీవల దిగుమతి చేసుకున్న కొత్తరకం విత్తనం కదిరి లేపాక్షి-1812రకం విత్తనం సాగు చేసిన రైతులకు దిగుబడులు పెరిగాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది రైతులు ఇదే విత్తన రకాన్ని వాడుతున్నారు. ఇంతకు ముందున్న విత్తన రకాల ద్వారా కూడా మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది. యాసంగి సీజన్లో వరిపంట సాగు చేసే కంటే వేరుశనగ సాగు చేసుకోవడం ఎంతో ఉత్తమం.
– నాగరాజు, మండల వ్యవసాయాధికారి, హుస్నాబాద్
వేరుశనగ పంట సాగుతో మంచి లాభాలు
ప్రభుత్వం వరిపంటకు బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచిస్తున్నందున రైతులు వేరుశనగర పంటను సాగు చేసుకోవడం మంచిది. ఇందులో మంచి విత్తన రకాన్ని ఎంచుకొని సాగు చేసినట్లయితే లాభాలు వస్తాయి. వానకాలంలో నేను రెండు ఎకరాల పంట వేసి మంచి లాభాలు పొందాను. ఇప్పుడు ఐదు ఎకరాల్లో పల్లి సాగు చేస్తున్నా. రైతులు ఈ పంటపైనే దృష్టిసారించి యాసంగిలో లాభాలు పొందాలని ఆశిస్తున్నా.
– తిరుపతిరెడ్డి, రైతు, మీర్జాపూర్, హుస్నాబాద్ మండలం