రాయపోల్. అక్టోబర్ 1 : పేద ప్రజలకు తోచిన విధంగా సహాయం చేస్తేనే ఎల్లప్పుడూ జీవితంలో గుర్తు ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ షారుఖ్ రుఖ్ హుస్సేన్ అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని తిమ్మక్కపల్లి గ్రామంలో మాజీ జడ్పీటీసీ లింగాయపల్లి యాదగిరి తో కలిసి పలువురికి దసరా పండుగ సందర్భంగా నూతన వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పండుగకు ముస్లిం సోదరులకు బట్టలను నిత్యావసర సరుకులను అందజేశామన్నారు. దసరా పండుగ సందర్భంగా హిందువులకు బట్టలను అందజేయడం ఎంతో సంతోషంగా ఉంటుందన్నారు.
తాను ఓట్ల కోసం రాలేదని, పార్టీలకు అతీతంగా నిరుపేదలకు సహాయం అందించేందుకు ముందు వరుసలో ఉన్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని పేదలకు, వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపిన ఘనత కెసిఆర్ కి దక్కుతుందని తెలిపారు. పదవులు వస్తాయి.. పోతాయని.. పేద ప్రజలకు సేవలు చేయడం తాను ఎప్పుడు మరువనని స్పష్టం చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు ఇప్ప దయాకర్, మండల నాయకులు రాజిరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, చింతకింది మంజూరు, తదితరులు పాల్గొన్నారు.