ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం దత్త జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని బర్ధీపూర్ దత్తగిరి ఆశ్రమంలో నిర్వహించిన వేడుకల్లో వైద్యారోగ్య, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర రాజానర్సింహ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దత్తాత్రేయ కృపతో అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి సాధించాలన్నారు. దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతులు అవదూతగిరి మహరాజ్, డాక్టర్ సిద్ధేశ్వరస్వామీజీల ఆధ్వర్యంలో ఆశ్రమంలో మూడురోజులుగా జ్వోతిర్లింగాల అభిషేకం, పూర్ణ్ణాహుతి, దత్త చండీ హోమం నిర్వహించారు.
ఝరాసంగం, డిసెంబర్ 26 ః దత్తాత్రేయ స్వామి కృపతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మంగళవారం ఝరాసంగం మండలంలోని బర్ధీపూర్ దత్తగిరి ఆశ్రమంలో నిర్వహించిన దత్త జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతులు అవదూతగిరి మహరాజ్, డాక్టర్ సిద్దేశ్వర స్వామిజీలు ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆశ్రమంలో నిర్వహిస్తున్న జ్వోతిర్లింగాల అభిషేకం, దత్తచండీ హోమం పూర్ణాహుతిలో పాల్గొనడంతో పాటు ఆశ్రమంలోని పలు ఆలయాల్లో మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ దైవ సంకల్పంతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నారు. దత్తాత్రేయ స్వామి జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ దేవదాస్, పార్టీ మండల అధ్యక్షుడు హనుమంత రావు పాటిల్, సంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్శంకర్, జహీరాబాద్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నరేశ్గౌడ్, నాయకులు ప్రవీణ్ పటేల్, అన్వర్, వేణుగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.