మద్దూరు(ధూళిమిట్ట), ఆగస్టు08 : ఒకప్పుడు తీవ్ర కరువు ప్రాంతంగా ముద్రపడి తినడానికి తిండి లేని పరిస్థితులలో దుబాయి, బొంబాయిలకు ఈ ప్రాంత ప్రజలు వలస వెళ్లారు. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు వ్యవసాయానికి 24గంటల కరెంట్, రైతాంగానికి పెట్టుబడి సహాయం వంటి బృహత్తర కార్యక్రమాలతో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారింది.
సిద్దిపేట జిల్లా మద్దూరు, ధూళిమిట్ట మండలాలలో సాగువిస్తీర్ణం రెట్టింపు స్థాయిలో పెరగడంతో కూలీల కొరత ఏర్పడింది. దీంతో కూలీల కొరతను అధిగమించేందుకు రైతులు పచ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ర్టాలతో పాటు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి కూలీలను తీసుకవస్తున్నారు.
ఆయా రాష్ట్రల నుంచి ఆడ, మగ అనే భేధం లేకుండా కూలీలు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున వరినాట్లు వేస్తున్నారు. సోమవారం ధూళిమిట్ట మండలంలోని బైరాన్పల్లిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ నుంచి వచ్చిన వలస కూలీలు వరి నాట్లు వేస్తున్నారు. వీరికి ఎకరానికి రూ. 5500ల చొప్పున వలస కూలీలకు చెల్లిస్తున్నట్లు ఈ ప్రాంత రైతులు తెలిపారు.
నాడు ఉపాధి లేక వలసెల్లిన ఇక్కడి నేడు ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఇతర రాష్ట్రాల నుంచే కూలీలు ఉపాధి కోసం ఇక్కడికి రావడం తెలంగాణ అభివృద్ధికి నిదర్శనమని ప్రజలు చర్చించుకుంటున్నారు.