సిద్దిపేట, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతుల చెంతనే ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేసి పండించిన పంటను కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఆదిశగా ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశాలతో జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, గన్నీబ్యాగులు, టార్పాలిన్లు, ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, వర్షంలో ధాన్యం తడవకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి తదితర అంశాలపై జిల్లా స్థాయి అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశాలు నిర్వహించి పలు సూచనలు చేశారు. జిల్లాలో అక్కడక్కడ వరి కోతలు ప్రారంభమయ్యాయి. వరి కోత మిషన్ల ద్వారా కోతలు ప్రారంభించి ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. ప్రతి రెండు మూడు గ్రామాల్లో ఒకటి చొప్పున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయడానికి అధికారులు కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లాల అధికారులను మంత్రి హరీశ్రావు అదేశించారు. ఆదిశగా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 12,70,645 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు 927 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఏ గ్రేడు ధాన్యం రూ.2060, బీ గ్రేడ్ ధాన్యం రూ.2040గా ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా కొనుగోలు కేంద్రాలకు కావాల్సిన పరికరాలు, గన్నీబ్యాగులు, టార్పాలిన్ కవర్లు తదితర వాటిని సమకూర్చనున్నారు.
బయటి నుండి ధాన్యం రాకుండా చెక్ పోస్టులు
ధాన్యం కొనుగోలుకు సంబంధించి అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. పక్క రాష్ర్టాల నుండి తీసుకువచ్చే ధాన్యం కట్టడి చేసేలా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. రైతులు ఎన్ని ఎకరాల్లో పంట సాగు చేశారు. ఏ రైతు పేరు మీద ఎంత సాగైంది అనే వివరాలు వ్యవసాయశాఖ పోర్టల్లో పొందుపర్చారు. దీని ఆధారంగా రైతుల నుండి వరి ధాన్యం సేకరించనున్నారు. ధాన్యం సేకరణలో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా ముందస్తుగానే అన్ని చర్యలు తీసుకుంటున్నారు. రైతుల వద్ద ధాన్యం సేకరణ కాగానే వెంటనే మిల్లర్లకు తరలించే విధంగా ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి పక్కాగా ధాన్యం సేకరణ జరిగేలా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. రోజూ కొనుగోలు కేంద్రాలకు కేటాయించిన అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ధాన్యం కొనుగోలు తీరు తెన్నులను పరిశీలిస్తారు. వర్షం పడితే ధాన్యం తడవకుండా టార్పాలిన్లు ఇత ర సౌకర్యాలు కల్పించేలా అధికారులు ప్రణాళికతో ముం దుకు కదులుతున్నారు. జిల్లాల వారీగా మంత్రి హరీశ్రావు ఆదేశాలతో జిల్లా కలెక్టర్లు అధికారుల సమావేశాలు నిర్వహించి దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈ సమావేశాల్లో అన్ని కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ స్కేల్, మాయిశ్చర్ మీటర్, టార్పాలిన్లు కచ్చితంగా అందుబాటులో ఉండి పని చేసే విధంగా చూసుకోవాలని కేంద్ర నిర్వాహకులకు సూచించారు. నాణ్యతా ప్రమాణాలు గల ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చేలా రైతులను చైతన్యపర్చే విధంగా దిశానిర్దేశం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా కేంద్రాల్లో తాగునీటి సదుపాయం, నీడ, తాత్కాలిక మరుగుదొడ్డి, కరెంట్ మొదలగు సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణకు అవసరమై న గన్నీ బ్యాగులు సమకూర్చాలని పౌరసరఫరాల అధికారులను కలెక్టర్లు ఆదేశించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు ప్రధానంగా ధాన్యం లోడింగ్, అన్లోడింగ్లో జాప్యం జరుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో ధాన్యం నిల్వకోసం గోదాములను గుర్తించి ఉపయోగించుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 7,94,834 ఎకరాల్లో వరి సాగు
సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించడంతోపాటు రైతు ముంగిటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. ఇందుకోసం జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి వానకాలం సాగు గణనీయంగా పెరిగింది. ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతూనే ఉంది. పుష్కలంగా సాగు నీరు అందడంతో గుంట భూమి ఖాళీలేకుండా సాగవుతుంది. దీంతో భూమికి బరువయ్యేలా పంట వస్తున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 7,94,834 ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. ఈ వానకాలంలో 19,22,300 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. దీనిలో స్థానిక అవసరాలకు పోను మిగిలిన ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. 927 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మహిళా సంఘాలు, సొసైటీలు, మార్కెట్ల ద్వారా వరి ధాన్యం కొనుగోలు చేయిస్తాం.
– తన్నీరు హరీశ్రావు, రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి
జిల్లాల వారీగా వరి సాగు
ఉమ్మడి మెదక్ జిల్లాలో 7,94,834 ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. ఈ వానకాలంలో రైతులు సాగు చేసిన పంట లెక్కల ప్రకారం 19,22,300 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. దీనిలో రైతుల అవసరాలు, స్థానిక మార్కెట్, ఇతర అవసరాలకు పోను మిగిలిన 12,70,645 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు
చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లాలో 927 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లలో జిల్లాల అధికార యంత్రాంగం నిమగ్నమైంది.
గతంలో కంటే రెట్టింపు స్థాయిలో వరి సాగు
జిల్లా వ్యాప్తంగా వానకాలం వరి కోతలు ప్రారంభమయ్యాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రతి యేటా వరి సాగు విస్తీర్ణం పెరుగుతుంది. పుష్కలంగా సాగు నీరు అందడంతో వరిసాగు అంచనాలకు మించి సాగవుతుంది. రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. సిద్దిపేట జిల్లాలో ఈవానకాలం గతంలో కంటే 60 వేల ఎకరాలకు పైగా వరి సాగు చేశారు. ఈ వానకాలంలో జిల్లాలో 3,61,090 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. జిల్లాలో ఈ వానకాలంలో 9,13,300 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. దీనిలో స్థానిక అవసరాలకుపోను 5,00,645 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. ధాన్యం సేకరణకు జిల్లా వ్యాప్తంగా 411 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.గ్రామాల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేసి మహిళా సంఘాలు, సొసైటీలు, ఏఎంసీ, మెప్మా ద్వారా వరి ధాన్యం కొనుగోలు చేస్తారు. ఏ గ్రేడ్ వరి ధాన్యం ఒక క్వింటాల్కు రూ. 2060, సాధారణ రకం ధాన్యం రూ. 2040 క్వింటాల్కు చొప్పున కొనుగోలు చేస్తారు. సంగారెడ్డి జిల్లాలో 1,39,000 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ఇందుకు 3,30,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. స్థానిక అవసరాలకు పోను మిగిలిన 2,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించి జిల్లాలో 166 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక్కడ డీసీఎంఎస్, పీఏసీఎస్, మహిళా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తారు. మెదక్ జిల్లాలో 2,94,744 ఎకరాల్లో వరి సాగు చేశారు. 6,79,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. దీనిలో స్థానిక అవసరాలకు పోను మిగిలిన 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు 350 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.