సిద్దిపేట, జనవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పదో తరగతిలో అదే పట్టుదల ఉండాలి.. రాష్ట్రంలో సిద్దిపేట నియోజకవర్గం అగ్రస్థానంలో నిలవాలి… 119 నియోజకవర్గాల్లో సిద్దిపేట వందశాతం ఫలితాలు సాధించి, నంబర్వన్గా నిలవాలి.. అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో పదో తరగతి పరీక్షలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్చి 18 నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ఒక విద్యార్థి కూడా ఫెయిల్ కావద్దన్నారు. సిద్దిపేట ప్రజలు, పిల్లలకు మంచి చేయాలనేదే తన నిరంతర తపన అన్నారు. తన పిల్లలను ఎలా బాధ్యతతో చదివిస్తానో అదే విధంగా ప్రయత్నిస్తున్నానన్నారు. ఎప్పటిలాగా పదో తరగతి పరీక్షా ఫలితాలపై దృష్టి పెట్టాలన్నారు. సిద్దిపేట ప్రతిష్ట, గౌరవాన్ని కొనసాగించాలన్నారు.
ఇప్పటికే సిలబస్ పూర్తయి ప్రత్యేక తరగతులు మొదలయ్యాయని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు అన్ని మనమై అండగా ఉండాలని సూచించారు. ఇప్పటి నుంచి పరీక్షలపై ప్రణాళిక తయారు చేసుకుని ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. గతేడాది సిద్దిపేట జిల్లా 98.65 ఉత్తీర్ణత సాధించిందని, రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్నామని, అందులో మన నియోజకవర్గం 98.67 శాతం వచ్చిందన్నారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం సాధించి నియోజకవర్గం ముందుండాలని అన్నారు. నియోజకవర్గంలోని జడ్పీహెచ్ఎస్, మోడల్, కస్తూర్బా, రెసిడెన్షియల్ సూల్స్ మొత్తం 65 పాఠశాలల్లో 2,516 మంది విద్యార్థులు ఉన్నారని, అందరూ పాస్ కావాలన్నారు. తనవంతు ప్రయత్నంగా పిల్లల తల్లిదండ్రులకు ఉత్తరాలు రాశానని.. డిజిటల్ కంటెంట్ బుక్స్ పంపిస్తున్నానని.. స్నాక్స్ కూడా తానే ఏర్పాటు చేపిస్తానన్నారు. మరింత ఆత్మవిశ్వాసం, మనో ధైర్యం నింపేలా తల్లిదండ్రులతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానన్నారు. విద్యార్థులకు అని తానై చూసుకుంటానని, వందశాతం ఫలితాల బాధ్యత మీదేనని అధికారులు, హెచ్ఎంలకు సూచించారు. ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, సాయంత్రం స్నాక్స్ ఏర్పాటు చేయాలని, అందుకు పూర్తి సహకారం ఉంటుందన్నారు.
10 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయులు ఉండాలని, కేర్ టీచర్.. ఈ కేర్ టీచర్స్తో తాను 15 రోజులకు ఒకసారి మాట్లాడుతానన్నారు. ఆ టీచర్కు అప్పగించిన విద్యార్థులను 10/10 సాధించేలా బాధ్యత వహించాలన్నారు. తల్లిదిండ్రులతో మీటింగ్ ఏర్పాటు చేసి పదో తరగతి పరీక్షలు అయ్యే వరకు టీవీలు, ఫోన్లు, ఆటలు పూర్తిగా బంద్ చేసేలా చెప్పాలన్నారు. తాను పాఠశాల విజిట్ చేస్తానని, తల్లిదండ్రులకు ఉత్తరాలు రాశానని, ఉదయం 4 గంటలకే నిద్ర లేపి చదివించాలన్నారు. ఈ ఏడాది కూడా డిజిటల్ కంటెంట్ బుక్స్ పంపిస్తామన్నారు. గతేడాది 10/10 సాధించిన విద్యార్థులకు ట్యాబ్ ఇచ్చామన్నారు. వందశాతం ఫలితాలు సాధించిన పాఠశాలలకు పారితోషకం అందజేశామని గుర్తుచేశారు. ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రత్యేక చొరవ చూపి రోజూ ఏదో ఒక సమయంలో పాఠశాలలను సందర్శించాలని సూచించారు. సమీక్షలో డీఈవో శ్రీనివాస్రెడ్డి, నోడల్ అధికారి రామస్వామి, ఎంఈవోలు యాదవరెడ్డి, దేశిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.