సిద్దిపేట, నవంబర్ 5 : ‘మంత్రి హరీశ్రావు కమిట్మెంట్ ఏమిటో సిద్దిపేట ప్రజలకు తెలుసు. నీతో చెప్పించుకునే అవసరం మా నేతకు లేదు.. అభివృద్ధి, సంక్షేమం ఆయనకు రెండు కండ్లు.. ఈటల జాగ్రత్తగా మాట్లాడు’.. అని టీఆర్ఎస్వీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మేర్గు మహేశ్ హెచ్చరించారు. శుక్రవారం సిద్దిపేటలోని మంత్రి హరీశ్రావు నివాసంలో టీఆర్ఎస్వీ నేతలు భిక్షపతి నాయక్, శ్రీకాంత్రెడ్డి, రమేశ్, సతీశ్, బండి శ్రీకాంత్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావును విమర్శించే హక్కు ఈటలకు లేదని, సంస్కారం మరిచి, అహంకారంతో రాజేందర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. భూకబ్జాల ఆరోపణలతో కాషాయ పార్టీలో చేరి, కాంగ్రెస్తో అనైతిక పొత్తుతో గెలిచిన ఈటల, తమ నేతలను విమర్శిస్తారా? అని ప్రశ్నించారు. ‘సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై కుట్రలు చేసింది మీరు.. గతంలో మిమ్మల్ని హుజూరాబాద్ ప్రజలు గెలిపిస్తే అక్కడ అభివృద్ధి చేయలేదు.. ఇక్కడ మంత్రి హరీశ్రావు గెలిపిస్తే సిద్దిపేటను అభివృద్ధి పథంలో గొప్పగా తీర్చిదిద్దారు’.. అని అన్నారు. తెలంగాణ ఉద్యమ పిడికిలి ఎత్తిన నాటి నుంచి స్వరాష్ట్రం వచ్చాక, బంగారు తెలంగాణ కోసం బాటలు వేస్తున్నది సిద్దిపేట గడ్డ అన్నారు. అభివృద్ధి.. సంక్షేమానికి రోల్ మోడల్గా నిలుస్తున్న గడ్డ సిద్దిపేట అని స్పష్టం చేశారు. ఈ గడ్డను చులకన చేసేలా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈటల మాటల తీరు సిద్దిపేట ప్రజల చైతన్యాన్ని ప్రశ్నించినట్లుగా ఉందన్నారు.
సిద్దిపేట ప్రజలు మంత్రి హరీశ్రావును ఆరు సార్లు అద్భుతమైన మెజార్టీతో గెలిపించి, ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేశారన్నారు. అభివృద్ధి ప్లానర్ అయినందునే 1లక్షా 18వేల మెజార్టీ ఇచ్చారని, 20 ఏండ్లుగా రాజకీయం చేస్తున్న ఇలాంటి విజయం మీకెందుకు దక్కలేదన్నారు. ఇకనైనా మంత్రి హరీశ్రావుపై అక్కసు వెళ్లగక్కకుండా హుజూరాబాద్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. ఈటల నిఖార్సయిన నాయకుడైతే, చెమటోడ్చి ఎందుకు నెగ్గాల్సి వచ్చిందన్నారు. 70 ఏండ్లలో జరుగని అభివృద్ధిని ఏడేండ్లలో జరిగినందునే సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు అభిమానం, గౌరవం పెరిగిందన్నారు. హుజూరాబాద్లో దళితబంధు ఆపి, ఇప్పుడు మీరే అందరికీ ఇవ్వాలని చిల్లర రాజకీయం చేస్తారా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ప్రజల తీర్పును శిరవహిస్తామని హుందాగా మాట్లాడరని, మీరు విజ్ఞతను మరిచి మట్లాడతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థి విభాగం నేతలు పాల్గొన్నారు.