సిద్దిపేట, నవంబర్ 5: టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత సీఎం కేసీఆర్, సిద్దిపేటకు ఉంది. 14 ఏండ్ల పోరాటానికి స్ఫూర్తినిచ్చిన పురిటి గడ్డ నాడు ఉద్యమానికి, నేడు అభివృద్ధికి దిక్సూచిగా మన సిద్దిపేట నిలిచింది. టీఆర్ఎస్ పార్టీ 20 ఏండ్ల చరిత్రలో మన సిద్దిపేటకు గొప్ప ప్రాధాన్యత ఉన్నదని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం సిద్దిపేట శివారులో గల పొన్నాలలోని తెలంగాణ భవన్లో సిద్దిపేట పట్టణ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ నాడు పార్టీని స్థాపించి సిద్దిపేట ప్రజల దీవెనతో పదవులను గడ్డిపోచలుగా వదిలిపెట్టి తెలంగాణ ఉద్యమాన్ని భుజానికెత్తుకుని ‘ఉద్యోగ గర్జన’, ‘జైలు భరో’ కార్యక్రమానికి నాడు సీఎం కేసీఆర్ ఆమరణ దీక్షకు వేదికగా నిలిచింది సిద్దిపేట అన్నారు. ఇదే నెలలో 2009 నవంబర్ 29న రంగధాంపల్లి వద్ద దీక్షను చేపట్టాం. ఉద్యమ నాయకుడు కేసీఆర్ను అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో వేశారు. మనమంతా మెదక్ జైల్లో ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీని స్థాపించి రాష్ర్టాన్ని సాధించిన మన నాయకుడు కేసీఆర్ ఈ గడ్డ మీద పుట్టడం మనందరికీ గర్వకారణంగా చెప్పుకునే గొప్ప సందర్భమిది. ఇంతకంటే మన ప్రజలకు, మనకు గౌరవం ఏముంటుంది.. ఒకసారి మనం ఆలోచించాలి. నాడు తెలంగాణ.. కరువు, కన్నీళ్లతో అల్లాడుతుండే. నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం కాళేశ్వరం నీళ్లతో కళకళలాడుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. టీఆర్ఎస్ పార్టీకి అన్నివర్గాల నుంచి అద్భుతమైన స్పందన ఉందని, ఆ దిశగా టీఆర్ఎస్లో అందరినీ భాగస్వాములను చేయాలన్నారు. ముఖ్యంగా యువతను, కొత్తతరం నాయకులను, మహిళలను అన్ని కమిటీల్లో భాగస్వామ్యం చేయాలి. గ్రామగ్రామాన కమిటీలను, అనుబంధ కమిటీలను పటిష్టంగా వేయాలన్నారు.
కార్యకర్తలంటే నాయకుడి కుటుంబ సభ్యులు..
టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంటే నాయకుడి కుటుంబ సభ్యులని, పార్టీ కార్యకర్తలు నా కుటుంబ సభ్యులతో సమానమని మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రతి ఒక్కరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. 20 ఏండ్ల నుంచి పార్టీకి పనిచేస్తున్న కార్యకర్తలను, నాయకులను పాత కొత్త అనే భేదాభిప్రాయాలు లేకుండా భాగస్వాములను చేయాలన్నారు. కరోనాతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. వచ్చే అన్ని కమిటీల్లో మహిళలు, యువకులకు భాగస్వామ్యం ఇవ్వాలన్నారు. యాక్టివ్గా ఉండే విద్యార్థులకు, యువతకు సోషల్ మీడియా కమిటీలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కమిటీలు వేసిన అనంతరం ప్రతి 3 నుంచి 6 నెలలకు ఒకసారి కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం పెట్టి అందరినీ కలుస్తా అన్నారు. ఈ నెల 29న వరంగల్లో జరిగే భారీ బహిరంగ సభకు పెద్దఎత్తున తరలివెళ్లేందుకు విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకున్నామన్నారు. కమిటీలు, సమన్వయ కమిటీల ఆధ్వర్యంలో ప్రతి రోజు 2, 3 వార్డు కమిటీలను వేయడం జరుగుతుందన్నారు.
కార్యకర్తలకు ఆత్మీయంగా అన్నం వడ్డించిన మంత్రి హరీశ్రావు..
సంవత్సరం నుంచి ఎన్నికల్లో బిజిబిజీగా ఉండి కార్యకర్తలతో మనసు విప్పి మాట్లాడే తీరిక దొరుకకపోవడంతో శుక్రవారం జరిగిన సమావేశంలో కార్యకర్తలకు తానే స్వయంగా అన్నం వడ్డించి ఆత్మీయంగా పలుకరిస్తూ నేనున్నానని ధైర్యాన్ని నింపారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మంత్రితో సంతోషాన్ని పంచుకున్నారు.