Harish Rao | సిద్దిపేట అర్బన్, జనవరి 31: మీ పిల్లలకు మంచి భవిష్యత్ అందించేందుకు మీ శ్రమ వెలకట్టలేనిది.. పిల్లలకు నాణ్యమైన విద్య అందితేనే వారి భవిష్యత్ బాగుంటుంది.. విద్యార్థులకు పదోతరగతి కీలకమైనది, వారి భవిష్యత్కు పునాదులు వేసే వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి.. అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు రాసిన మాటలు తమలో స్ఫూర్తిని నింపడంతో పాటు తమ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని టెన్త్ విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే హరీశ్రావు పదో తరగతి ఉత్తీర్ణతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా ప్రతి పాఠశాలపై నియోజకవర్గ స్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయులకు ఎంత బాధ్యత ఉందో.. తల్లిదండ్రులకు కూడా అంతే బాధ్యత పెంచాలని.. వారి పిల్లలు పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా అడుగులు వేయాలని.. గత నాలుగేండ్లుగా టెన్త్ విద్యార్థుల ఇంటికి ఆయన ఉత్తరాలు పంపిస్తున్నారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు రాసిన ఉత్తరం విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. తమ పిల్లలపై హరీశ్రావు చూపిస్తున్న శ్రద్ధకు వారు ముగ్ధులవుతున్నారు. ఒక గురువులా, ఒక తండ్రిలా, ఒక అన్నలా, ఒక కొడుకులా తమకు మనోధైర్యాన్ని కల్పిస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా పిల్లలకు మంచి భవిష్యత్కు పునాది వేస్తూ.. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఆత్మవిశ్వాసాన్ని నింపారని తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి హరీశ్రావు రాసిన ఉత్తరంతో తమ బిడ్డబాగా చదివి ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఆయన్ను కలుస్తామని తెలిపారు.
ఒక కుటుంబ సభ్యుడిలా బాధ్యతతో ఇంత బాగా తమ గురించి కేర్ తీసుకుంటున్న హరీశన్నకు ధన్యవాదాలు అంటూ చిన్నకోడూర్ మండలం విఠలాపూర్లోని ఓ కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. విఠలాపూర్ గ్రామానికి చెందిన టెన్త్ విద్యార్థి అజయ్ తల్లిదండ్రులు ఐల్లయ్య, స్వప్నలు ఉత్తరం చదివి ఈ విధంగా స్పందించారు. ఆయన ఆశయం నెరవేరే విధంగా 100 శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా తమలో నూతనోత్సాహం కలిగించిందని విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.