సిద్దిపేట, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): లోక కల్యాణార్థం, విశ్వశాంతి కోసం యాగాలు చేయడం గొప్ప విషయమని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సిద్దిపేటలో కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి పర్యవేక్షణలో నేటి(శనివారం) నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు జరుగనున్న ‘కృష్ణ కాలచక్రం’ యాగ పనులను శుక్రవారం మంత్రి హరీశ్రావు పరిశీలించారు. స్వామి వారి ఆశీస్సులు తీసుకొని యాగశాల ప్రాంగణమంతా కలియతిరిగారు. పది రోజుల నుంచి యాగ నిర్వాహకులు, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, నందిని శ్రీనివాస్ చేసిన పనులను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సిద్దిపేట ఆధ్యాత్మికతకు ఉట్టిపడేలా యాగం నిర్వహించాలన్నారు. పోలీసు, హెల్త్, మున్సిపల్, విద్యుత్ ఆయా శాఖల సమన్వయంతో 15 రోజలు పాటు యాగం సంపూర్ణమయ్యేవరకు చొరవ చూపాలన్నారు. యాగానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇంతటి గొప్ప యాగం 78వ విశ్వశాంతి శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించడం గొప్ప పుణ్యమన్నారు. ఇంత కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాన్నారు. దాదాపు 800 మంది రుత్వికులు పాల్గొనే కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. యాగం పూర్తయ్యే వరకు ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు ఇక్కడే ఉండి, అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.
పాలమాకులలో..
వెయ్యేండ్ల శంభుదేవుని ఆలయంలో శతచండీ యాగం చేయడం స్వామి వారి ఆశీస్సులే అని మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం నంగునూరు మండలం పాలమాకులలోని శంభుదేవాయంలో బ్రహ్మశ్రీ జనమంచి సీతారామ శర్మ ద్వివేది నేతృత్వంలో జరుగుతున్న శతచండీ యాగం ఉత్సవాల్లో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దైవ సంకల్పం గొప్పదన్నారు. వెయ్యేండ్ల శంభుదేవాలయం పునరుద్ధరణలో భాగంగా నిర్వహించిన శత చండీయాగంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. పాలమాకుల గ్రామానికి ఒక ప్రత్యేకత ఉందన్నారు. శంభుదేవుని ఆలయానికి ఎంతో ఘన చరిత్ర ఉందని, అదే విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వెయ్యి రోజుల రిలే నిరాహార దీక్షలు చేసిన చరిత్ర ఈ గ్రామానికి ఉందని గుర్తు చేశారు. గొప్ప ప్రాశస్త్యం కలిగిన శంభుదేవుని ఆలయం పునరుద్ధరణకు శృంగేరి పీఠం నుంచి వేద పండితులు రావడం, ఈ యాగం జరిపించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
ఆలయ పునరుద్ధరణతో ఆలయానికి పూర్వవైభవం, యాగ ఫలం తప్పక సిద్ధిస్తుందని, దైవ సంకల్పముంటే, సాధ్యం కాదంటూ ఏదీ లేదన్నారు ఆలయం బాగు చేయాలని గ్రామం బాగుండాలని శృంగేరి పీఠాధిపతుల ఆశీస్సులతో ఈ యాగం జరుగుతుందన్నారు. ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వ పరంగా వ్యక్తిగత సంపూర్ణ సహకారం అందిస్తానన్నారు. ఆలయ అభివృద్ధికి గ్రామ ప్రజలు కలిసి ఆలయ పునరుద్దణకు పూనుకోవాలన్నారు. దాతలు ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, ఆయిల్ ఫెడ్ ఫార్మర్స్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎడ్ల సోంరెడ్డి, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సారయ్య, నాయకులు లింగంగౌడ్, సర్పంచ్ కుమార్, ఎంపీటీసీ ఏటీ తులసీ పరమేశ్వర్, నాయకులు దువ్వల మల్లయ్య, వేణు చక్రవరి, మహాపాల్రెడ్డి, రవీందర్రెడ్డిలు పాల్లొన్నారు.