సిద్దిపేట, మార్చి 23: పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ రాష్ట కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ అన్నారు. శనివారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు మోహన్లాల్, పాల సాయిరాం, గుండు భూపేశ్, ఎర్ర యాదయ్య, పక్రోద్దీన్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మిగిలిన జిల్లాల కంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యధికంగా ఎమ్మెల్యే సీట్లు బీఆర్ఎస్ గెలుపొందినట్లు తెలిపారు.
మెదక్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ బలంగా ఉందని, గెలుపు నల్లేరు మీద నడకే అన్నారు. సిద్దిపేట నియోజకవర్గం సమావేశం ఈనెల 27వ తేదీన నిర్వహిస్తామని, ఈ సమావేశానికి నియోజకవర్గంలోని 3వేల మంది ముఖ్య కార్యకర్తలు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావుతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పాల్గొంటారన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థికి వెంకట్రామిరెడ్డికి ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నట్లు తెలిపారు.
జిల్లాలో హరీశ్రావు నాయకత్వంలో తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తప్పుడు హామీలతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అయోమయానికి గురి అయ్యారని.. కానీ, 3 నెలల్లోనే కాంగ్రెస్ సర్కారుపై వ్యతిరేకత ప్రారంభమైందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. రూ.2 లక్షల పంట రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ విషయం ఎత్తడం లేదని, ఇంకా పింఛన్లు, తులం బంగారం, వరికి బోనస్ తదితర పథకాలను అమలు చేయడం లేదన్నారు. ఇంకా రైతుబంధు సాయం పూర్తిగా ఇవ్వలేదన్నారు. ఓవైపు కరెంట్ కోతలు, మరోవైపు పంటలు ఎండిపోతున్నా రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
మహిళలు తాగునీటి కోసం రోడ్లపైకి వస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ పాలన వదిలేసి రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. మేడిగడ్డ పేరు చెప్పి పంటలకు నీరివ్వకుండా ప్రభుత్వం కేసీఆర్ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్న విషయం ప్రజలు గమనిస్తున్నారన్నారు. మిషన్ భగీరథ నిర్వహణ సరిగ్గా లేక ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతన్నారని, ఖాళీ బిందెలతో నిరసనలు ప్రారంభమయ్యాయని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదన్నారు. ఈనెల 27న సిద్దిపేటలో జరిగే నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు వేలేటి రాధాకృష్ణ శర్మ పిలుపు నిచ్చారు.