ఆర్థిక ఇబ్బందులు కుటుంబాన్ని కబళించాయి. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామునిపట్లలో చోటుచేసుకుంది. సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వద్ద (పీఎస్వో) గన్మన్గా పనిచేస్తున్న 2013 బ్యాచ్కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ (పీసీ నెం.2735) ఆకుల నరేశ్ ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. శుక్రవారం ఉదయం విధుల నుంచి నేరుగా తన స్వగ్రామంలోని ఇంటికి వచ్చి భార్య చైతన్య(30), కుమారుడు రేవంత్(6), కుమార్తె రిషిత(5)ను తన సర్వీస్ రివాల్వర్తో కాల్చి అనంతరం తానూ కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత, ఇతర పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక సమస్యలే ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తి విచారణ చేసి వివరాలు వెల్లడిస్తామన్నారు.
సిద్దిపేట, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/చిన్నకోడూరు/ సిద్దిపేట అర్బన్ : ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబం ఉసురుతీశాయి. ప్రభుత్వోద్యోగి అయినా కొన్ని అనివార్య కారణాలతో చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక, పరువుపోతుందేమోననే భయాందోళనలో ఆ కుంటుంబం బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన చిన్నకోడూరు పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. భార్య, ఇద్దరు పిల్లలను గన్తో కాల్చి, తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనతో రామునిపట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు, స్థానికులు, కుటుంబీకుల కథనం ప్రకా రం.. సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వద్ద (పీఎస్వో) గన్మెన్గా పనిచేస్తున్న 2013వ బ్యాచ్కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ (పీసీ నం.2735) ఆకుల నరేశ్కు భార్య చైతన్య (30), కుమారుడు రేవంత్ (6), కుమార్తె రిషిత (5) ఉన్నారు. చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామానికి చెందిన ఆకుల రాములు, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో పెద్ద కొడుకు ఆకుల నరేశ్, రెండో కుమారుడు సురేశ్, మూడో కొడుకు శ్రీకాంత్. నరేశ్, సురేశ్ ఇద్దరూ 2013లో ఏఆర్ కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. చిన్నవాడు శ్రీకాంత్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. శ్రీకాంత్కు వివాహం కాలేదు. ఐదేండ్లుగా సిద్దిపేట కలెక్టర్కు గన్మెన్ (పీఎస్ఓ)గా విధులు నిర్వహిస్తున్నాడు. భార్యాపిల్లలతో సిద్దిపేటలోనే నివాసముండేవాళ్లు. 20 రోజుట కిందట సొంతగ్రామం రామునిపట్లకు మాకాం మార్చారు. అప్పటి నుంచి రోజూ ఇక్కడి నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. చైతన్య తాను పనిచేస్తున్న పాఠశాలకు పిల్లలను బస్సులో తీసుకెళ్లి, వస్తుండేది.
నరేశ్ చేసిన అప్పుల విషయంలో కుటుంబంతో ఐదారు నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. వారికి రెండెకరాల భూమి ఉంది. ఇటీవలే నరేశ్ తనకు అప్పులు బాగా పెరిగాయని, తన ఆస్తి పంచి ఇవ్వాలని తల్లిదండ్రులను అడిగాడు. నరేశ్ మాట విన్న తల్లిదండ్రులు ఒక ఎకరం అమ్మి అందులోంచి నీ వాటా తీసుకోమని అమ్మారు. ఎకరం పొలాన్ని అమ్మగా రూ.42 లక్షలు వచ్చాయి. అందులోంచి నరేశ్ వాటా రూ.30 లక్షలు ఇచ్చారు. వాటిని అప్పుల వాళ్లకు కట్టినట్లు స మాచారం. మిగితా డబ్బు కూడా ఇస్తే మిగిలిన అప్పు లు కడతానని తల్లిదండ్రులతో నరేశ్ గొడవపడ్డాడు. ఈ తీరుగా ఎందుకు అప్పలు అయ్యాయి? మొత్తం నీ అప్పులు కడితే మిగితా ఇద్దరి పరిస్థితి ఏంటి అని తల్లిదండ్రులు నరేశ్ను నిలదీశారు. అప్పటికే మితిమీరిన అప్పుల ఊబిలో కురుకుపోయిన నరేశ్పై అప్పులిచ్చిన వాళ్ల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. ప్రభుత్వోద్యోగిగా అప్పుల వాళ్లు నిలదీస్తే పరువుపోతుందని భావించి మానసిక ఒత్తిడికి లోనయ్యేవాడు. శుక్రవారం సిద్దిపేట కలెక్టర్ వద్ద డ్యూటీలో ఉన్న నరేశ్ నేరుగా తన భార్యకు ఫోన్ చేసి పిల్లలను స్కూల్కు పంపవద్దని, తాను వస్తున్నానని చెప్పాడు. ఇంటికి వచ్చి రాగానే తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్తో భార్యాపిల్లలను కాల్చి, తాను కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఏసీపీ సురేందర్రెడ్డి, ఇతర పోలీస్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక సమస్యలే ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా నిర్దారించినట్లు సీపీ శేత్వ తెలిపారు. నరేశ్ డ్యూటీలో ఉండగానే ఘటన జరిగిందని, ఫోన్ స్వాధీనం చేసుకున్నామని, విచారించి వివరాలు వెల్లడిస్తామని సీపీ శ్వేత తెలిపారు. పోస్టుమార్టం కోసం సిద్దిపేటలోని జిల్లా దవాఖానకు తరలించారు.
ఏఆర్ కానిస్టేబుల్ ఆకుల నరేశ్ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. నరేశ్ తరుచూ ఆన్లైన్ బెట్టింగ్లు వేయడంతోనే అప్పుల ఊబిలో కూరుకుపోయాడని స్థానికులు ఇచ్చిన సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది. ఆన్లైన్ బెట్టింగ్తో సుమారు 80 లక్షల వరకు అప్పు చేసినట్లు సమాచారం.భార్యాభర్తల మధ్య గొడవతో భార్యాపిల్లలను కాల్చి, తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తున్నది. ఈ మేరకు సీపీ శ్వేత, ఏసీపీ సురేందర్రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.