సిద్దిపేట రూరల్, ఆగస్టు 9: ఎడ్యుకేషన్ హబ్గా సిద్దిపేట జిల్లా మారిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలంలోని తోర్నాల పరిధిలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సిద్దిపేటలో అన్ని విద్యాసంస్థలు ఉన్నాయన్నారు. నర్సింగ్ కళాశాల, మెడికల్ కళాశాల, పీజీ, ఇంజినీరింగ్, వ్యవసాయ, పశువైద్య కళాశాలలు తీసుకువచ్చామన్నారు. జిల్లాలోని విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే చదువుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుత కళాశాల భవనం నిర్మాణం చేసేందుకు నాలుగేండ్లుగా ప్రయత్నిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో తెలంగాణ ఏర్పాటుకాకముందు ఎట్లా ఉండే పరిస్థితులు ప్రస్తుతం ఎలా ఉన్నాయో చూడాలన్నారు. మూడు పంటల తెలంగాణ, ఉచితంగా నాణ్యమైన కరెంట్, ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయడం, పెట్టుబడి సాయం ఇలా అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలుచేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాక ముందు రోగం వస్తే ప్రభుత్వ దవాఖానల్లో పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు. ఇప్పుడు అందుబాటులోకి నాణ్యమైన వైద్యసేవలు తీసుకువచ్చినట్లు తెలిపారు. మానవులకే కాకుండా పశువులకు, పాడి పంటలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సిద్దిపేట పరిధిలోనే కావాల్సిన వైద్యసేవలు, రైతులకు సలహాలు అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుత కళాశాలతో విద్యార్థులకు దూరభారం తగ్గడంతోపాటు వసతి కూడా లభిస్తుందన్నారు. కార్యక్రమంలో టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ శ్రీధర్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజారాధాకృష్ణశర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్రెడ్డి, తోర్నాల వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, వైస్ ఎంపీపీ యాదగిరి, తోర్నాల సర్పంచ్ ఎల దేవయ్య, వ్యవసాయ శాస్త్రవేత్తలు, బీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.