సిద్దిపేట, జూన్ 5: రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు నిర్లక్ష్యం వహించడంతో వారిపై సిద్దిపేట కలెక్టర్ హైమావతి కొరడా ఝుళిపించారు. మొత్తం 175 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు కలెక్టర్ జారీచేశారు. ఈ నోటీసులకు సంబంధించి ఉద్యోగులు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.
జూన్ 2న రా ష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటులో నిర్లక్ష్యం వహించడంతో పాటు సమీక్షలకు గైర్హాజరైన అధికారులపై కలెక్టర్ చర్యలకు ఉపక్రమించారు. మొత్తం 175 మందికి షోకా జ్ నోటీసులను జారీచేశారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన వేడుకలకు, కలెక్టరేట్లో జరిగిన అవతరణ వేడుకలకు ఉద్యోగులు చాలామంది హాజరు కాలేదు. దీంతోపాటు బాధ్యతలు నెరవేర్చడంలో నిర్లక్ష్యం చూపడంతో కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఉద్యోగులకు నోటీసులు జారీ చేయడంతో జిల్లాలో చర్చనీయాంశ మైంది. కొంతమంది అధికారులను సస్పెండ్ చేశారు.
సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ కమిషనర్ అండ్ డైరెక్టర్ టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీచేశారు. ఈనెల 2న సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా యంత్రాంగం జారీచేసిన సూచనలు పాటించడంలో కమిషనర్ నిర్లక్ష్యం, విధి నిర్వహణలో వైఫల్యం చెందారని కలెక్టర్ హైమావతి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ జరిపి కమిషనర్ను సస్పెండ్ చేసినట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.