వెల్దుర్తి/రామాయంపేట/శివ్వంపేట/చేగుంట, అక్టోబర్ 25: విజయదశమిని పురస్కరించుకొని మండల కేంద్రం వెల్దుర్తిలో శ్రీ వేంకటేశ్వర ఆలయంలో దుర్గాభవానీ సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవీ శోభాయాత్రను బుధవారం అంగరంగవైభవంగా నిర్వహించారు. దుర్గామాల ధరించిన స్వాములతో పాటు వందలాది మంది భక్తుల నడుమ దుర్గాదేవిని ఘనంగా నిమజ్జనానికి తరలించారు. నిమజ్జనం సందర్భంగా శివసత్తుల శిగాలు, పోతరాజుల విన్యాసాలు, డోలుచప్పుళ్లు ఆకట్టుకున్నా యి. అంతకుముందు దుర్గామాలలు ధరించిన స్వాము లు కుటుంబసభ్యులు, బంధుమిత్రుల నడుమ ఇరుముడులు కట్టుకున్నారు. నిమజ్జనం అనంతరం ఇరుముడులతో దుర్గాస్వాములు అలంపూర్ జోగులాంబ అలయానికి తరలివెళ్లారు.
* రామాయంపేట పట్టణంతో పాటు మండలంలోని దామరచెరువు, డి.ధర్మారం, కోనాపూర్, కాట్రియాల, లక్ష్మాపూర్ తదితర గ్రామాల్లో బుధవారం దుర్గామాతల శోభాయాత్రను యువజన సంఘాల నాయకులు వైభవంగా నిర్వహించి తెల్లవారు జామున చెరువుల్లో నిమజ్జనం చేశారు. డి.ధర్మారం గ్రామంలో దుర్గామా త వద్ద లడ్డూను వేలంలో గ్రామానికే చెందిన ఫ్రెండ్స్ యూత్ రూ.11,350లకు దక్కించుకున్నారు.
* శివ్వంపేట మండలం పిల్లుట్లలో బుధవారం సర్పంచ్ పెద్దపులి రవి, భవానీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దుర్గాభవానీ అమ్మవారి శోభాయాత్రను కనుల పండువగా నిర్వహించారు. గ్రామంలోని పురవీధుల్లో అమ్మవారి శోభాయాత్ర నిర్వహించగా భక్తులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. అమ్మవారి అలంకరణ, కోలాటం ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో భవానీ ఉత్సవ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
* దేవీ శర్ననవరాత్రుల సందర్భంగా పలు గ్రామాల్లో అమ్మవారి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. చేగుంట మండల కేంద్రంతో పాటు చేగుంట, రెడ్డిపల్లి, కర్నాల్పల్లి, శేరిపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారికి తొమ్మిది రోజులుగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసి, బుధవారం రాత్రి పురవీధుల్లో శోభాయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి మంగళహారతులతో స్వాగతం పలికి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.