వాతావరణంలో వచ్చిన మార్పులతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కసారిగా చలి పెరిగింది. మాండస్ తుఫాన్ ప్రభావం ప్రజలకు వణుకు పుట్టిస్తోంది. ఆదివారం మెదక్ జిల్లాలో 19 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వారం రోజులుగా చలి ప్రభావం కొనసాగుతుండగా రోజు, రోజుకూ అధికమవుతోంది. గత పది రోజుల్లో కొన్నిచోట్ల కనిష్ఠంగా 11 డిగ్రీలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది. ప్రధానంగా చిన్నా, పెద్ద తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం, సాయంత్రం సమయంలో చలికి తోడు చల్లటి గాలులు వీస్తుండడంతో బయటకు వెళ్లాలంటేనే జనం భయపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తుండగా, ముసురు ఉంటున్నది. ఎవరికి అస్వస్థత ఉన్నా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే దవాఖానకు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. చలి పెరగడంతో స్వెట్టర్లు, దుప్పట్లు, మంకీ క్యాప్లు కొనుగోలు చేసేందుకు జనం మార్కెట్లకు క్యూ కడుతున్నారు.
మెదక్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతున్నది. దీంతో వృద్ధులు, పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతున్నది. జ్వరం, జలుబు, దగ్గు వంటి రుగ్మతలకు గురై దవాఖాన పాలవుతున్నారు. వారం రోజులుగా చల్లటి గాలుల ప్రభావంతో మెదక్ జిల్లా అంతటా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణ పరిస్థితికి భిన్నంగా శీతల గాలులు వీస్తున్నాయి. పది రోజుల్లో కొన్నిచోట్ల కనిష్ఠంగా 11 డిగ్రీలకు తక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది.
చలిగాలుల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా రాత్రితో పాటు పగటి ఉష్ణోగ్రతలు సైతం పడిపోతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచే ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా తగ్గిపోతూ తెల్లవారుజామున 3 వరకు అత్యల్ప స్థాయికి చేరుతున్నాయి. సాధారణంగా పగటి ఉష్ణోగ్రతలు 35 నుంచి 40 డిగ్రీలు ఉండాల్సి ఉండగా, 29 నుంచి 32 డిగ్రీలకు తగ్గుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రత మరీ తకువగా నమోదవుతున్నది. ఈ వారంలో సగటు రాత్రి ఉష్ణోగత్ర 15 నుంచి 17 డిగ్రీలుగా నమోదవుతూ వస్తున్నది.
చిన్నారులు, వృద్ధులపై తీవ్ర ప్రభావం..
శీతల గాలులు చిన్నారులు, వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. చలి గాలుల కారణంగా వారిలో శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా రెండేండ్లలోపు చిన్నారుల్లో న్యూమోనియా వ్యాధి సోకుతున్నది. ఉష్ణోగత్రలు తకువగా నమోదైన సమయంలో శ్వాసకోశ సంబంధమైన న్యూమోనియా, అస్తమా వంటి వ్యాధులను కలుగజేసే వైరస్లు మరింత శక్తివంతగా మారుతాయి. మిగతా కాలాలతో పోలిస్తే మనుషుల రోగ నిరోధక శక్తి కూడా చలికాలంలో చాలా తకువగా ఉంటుంది. దీంతో వైరస్ శరీరంలోని సులువుగా ప్రవేశించి శ్వాసకోశ వ్యాధులను కలుగజేస్తుంది. ఈ వైరస్ ప్రభావం ఎకువగా చిన్నారులు, వృద్ధులపై ఉంటుంది. ముఖ్యంగా రెండేండ్ల లోపు చిన్నారులు, 60 సంవత్సరాలు దాటిన వృద్ధుల విషయంలో తగు జాగ్రత్తలు అవసరమని చెబుతున్నారు. స్వెటర్లు, నాణ్యమైన రగ్గులను వాడడంతో పాటు వీలైన రూమ్ హీటర్లను అందుబాటులో ఉంచుకోవాలని చెబుతున్నారు. రూమ్ హీటర్ల ద్వారా చాలా వరకు చలి నుంచి ఉపశమనం పొందొచ్చని అంటున్నారు.
దట్టమైన పొగమంచు, చిరు జల్లులు..
రామాయంపేట, డిసెంబర్ 11: రామాయంపేట పట్టణంతో పాటు మండలంలోని మొత్తం దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఆదివారం ఎక్కడ చూసినా మంచు కురుస్తూనే ఉంది. సాయంత్రం ఐదు గంటలు దాటినా పట్టణాన్ని కమ్మేసిన పొగమంచు విడవలేదు. ఉదయం చిరుజల్లులు కురవడంతో ప్రజలు బయటకు రాని పరిస్థితి. చిరుజల్లులతో చలి తీవ్రత పెరిగింది. చలి గాలులతో జనం వెచ్చటి దుస్తులు ధరించి బయటకు వస్తున్నారు. ఇప్పటికి కూడా చినుకులు రాలుతూనే ఉన్నాయి.
రెండేండ్ల లోపు చిన్నారులను వెచ్చగా ఉంచేలా చూడాలి..
రెండేళ్ల లోపు చిన్నారులను ఎప్పుడూ వెచ్చగా ఉండేలా చూడాలి. శీతల గాలుల కారణంగా చిన్నారుల్లో ఈ మధ్య న్యూమోనియా కేసులు ఎకువగా కనిపిస్తున్నాయి. పిల్లల్లో జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు ఉంటే అశ్రద్ధ చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. చిన్నారులను చలిలో తిప్పడం, తిరగనివ్వడం చేయకూడదు. చల్లటి పదార్థాలు కాకుండా వేడివేడి పదార్థాలను పిల్లలకు పెట్టాలి.
– డాక్టర్ చంద్రశేఖర్, చిన్న పిల్లల వైద్యుడు