మెదక్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అధ్యక్షతన కలెక్టరేట్లోని అడిటోరియంలో జరిగిన ఎరుకల సాధికారిత పథకం ప్రారంభోత్సవానికి మంత్రులు, తన్నీ రు హరీశ్ రావు, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ఎరుకలకు సొసైటీలను ఏర్పాటు చేయడం, స్లాటర్ హౌసులు ఏర్పాటు, రవాణా సౌకర్యాలు మెరుగుపర్చడం, ఆన్లైన్ వ్యాపార మెలకువలు, తదితర అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
ఎరుకుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకం తీసుకు రావాలని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ పట్టుపట్టి ముఖ్యమంత్రిని ఒప్పించి ఈ పథకం తీసుకొచ్చినట్లు తెలిపారు. రూ.60 కోట్లతో ఎరుకల సాధికారిక పథకం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఎరుకల కులస్తులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నది అన్నా రు. సమాజంలో అట్టడుగు వర్గానికి చెందిన ఎరుకల కులానికి చెం దిన మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ ఎమ్మెల్సీగా చేయడానికి ముఖ్యమంత్రి నిర్ణయించి ప్రతిపాదనలు పంపినప్పటికీ గవర్నర్ను అడ్డుపెట్టుకొని బీజేపీ నాయకులు సత్యనారాయణను ఎమ్మెల్సీ కాకుండా అడ్డుకున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గిరిజనుల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దకుతుందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. స్వాతంత్య్రం వచ్చాక మొట్టమొదటిసారి దేశంలో ఎకడా లేని విధంగా గిరిజనుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తూ అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. ఈ పథకం ద్వారా ఎరుకల సంక్షేమం కోసం ప్రత్యేకంగా నిధులను అందజేసినట్లు తెలిపారు. ఈ పథకాన్ని ఎరుకలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. కేంద్రం ప్రభుత్వం అడుగడుగునా తెలంగాణకు నిధులు ఇవ్వకుండా అడ్డుపడుతున్నప్పటికీ సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో సంక్షేమ పథకాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయన్నారు.
ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎరుకల సాధికారత పథకం మొట్టమొదటిగా మెదక్ జిల్లాలో అమలు చేయడం తన అదృష్టం గా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా ఎరుకల కులస్తులు వ్యాపార మెలకువలు నేర్చుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. జీవన విధాన శైలిలో మార్పు లు రావాలని తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల వారికి జీవనోపాధి కల్పిస్తున్నారని గుర్తు చేశారు. మెదక్ జిల్లాలో ఎరుకల సాధికారత పథకం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
ప్రతి మండలంలో పందుల పెంపకానికి స్థలం ఇస్తామని, మండలానికి ఒక యూనిట్ను మంజూరు చేస్తూ రూ.60 లక్షలు కేటాయించామన్నారు.ఎరుకల జాతి ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ట్రైకా చైర్మన్ రాంచందర్ నాయక్, గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్.చోంగ్తు, జడ్పీ చైర్మన్ హేమలతా శేఖర్ గౌడ్, వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, కలెక్టర్ రాజర్షిషా, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, ఎరుకల నాయకులు కూతాడి రాములు, రాజు, నర్సింహులు, వివిధ జిల్లాల ఎరుకల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.