అయుత చండీ, అతిరుద్ర యాగాలతో సిద్దిపేట పునీతమైందని, ఇది చాలా అపురూపమైన అవకాశమని, సిద్దిపేట ప్రజలు అదృష్టవంతులని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. సిద్దిపేటలో నిర్వహిస్తున్న ‘కృష్ణ కాలచక్రం’లో భాగంగా గురువారం సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్రావు దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. శ్రీకృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో అపర భద్రాద్రిని తలపించేలా అట్టహాసంగా పట్టాభిషేకం నిర్వహించడం గొప్ప విషయమన్నారు.
సిద్దిపేట, డిసెంబర్ 1: భగవంతుని ఆశీస్సులు.. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో సిద్దిపేట ఆధ్యాత్మికతకు నెలవుగా మారిందని, రిజర్వాయర్ల ఖిల్లాగా అయ్యిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని వేములవాడ కమాన్ వద్ద శ్రీకృష్ణ పీఠాధిపతి కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘శ్రీకృష్ణ కాలచక్రం’లో భాగంగా గురువారం సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించారు. దీనికి మంత్రి సతీసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. 2013లో కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ సిద్దిపేట స్టేడియంలో శ్రీకృష్ణ కాలచక్ర యాగం నిర్వహించారని, ఆ మహిమతో 2014లో తెలంగాణ సిద్ధించిందన్నారు. ఎప్పుడైతే రాష్ట్రం సిద్ధించిందో ఈ ప్రాంతం అన్ని రంగాల్లోను అభివృద్ధిలోనూ, ఆధ్యాత్మికంగా, అద్భుతంగా తెలంగాణ ప్రాంతం ఆభివృద్ధిలో ముందుకెళ్తున్నదని చెప్పారు. ఎక్కడ దేవాలయాల పునరుద్ధరణ జరుగుతుందో.. భగవంతుని స్మరిస్తారో.. యజ్ఞ యగాదులు జరుగుతాయో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని మన పురాణాలు చెబుతున్నాయన్నారు.
నేడు సిద్దిపేటలో జరుగుతున్న అయుత చండీ.. అతిరుద్ర యాగంతో సిద్దిపేట పట్టణం 14 రోజులు భక్తి పారవశ్యంతో భగవంతుని నామస్మరణతో నిండిపోయిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ నిధులతో యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. నేడు లక్షలాది మంది భక్తులు యాదాద్రి దర్శనానికి వస్తున్నారన్నారు. ఇప్పటి వరకు దేవాలయ నిధులను ప్రభుత్వాలు వాడుకున్నాయి, కానీ, ప్రభుత్వ నిధులతో అద్భుతమైన దేవాలయాన్ని సీఎం కేసీఆర్ నిర్మించారని చెప్పారు. సిద్దిపేటలో యాజ్ఞం చేయడం అపూరూపమైదని, ఇది ప్రజలందరి అదృష్టమన్నారు. యాగంతో ఈ ప్రాంతం పునీతమైందని చెప్పారు. అపర భద్రాద్రిని తలపించేలా కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో అట్టహాసంగా సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించారని కొనియాడారు. స్వామివారికి ఎంతో మహిమ ఉందని, స్వామి వారు ఒంటరిగా వచ్చి సంకల్పంతో యాగం చేస్తానని చెప్పారని, దాని ఫలితమే యాగం అని అన్నారు. సంకల్పం ఉంటే సాధించలేనిది ఏది లేదన్నారు. సిద్దిపేటకు సంకల్పబలం ఉందని, ఏ కార్యమైనా సిద్ధిస్తుందన్నారు. సిద్దిపేట జిల్లాలో వర్గల్ సరస్వతీ దేవాలయం, కొమురవెల్లి మల్లన్న దేవాలయం, హుస్నాబాద్ రేణుకా ఎల్లమ్మ దేవాలయం, సిద్దిపేట కోటి లింగాల దేవాలయం, అనంతసాగర్ సరస్వతీ దేవాలయం, కొండపోచమ్మ దేవాలయాలతో ఆలయాలకు ఆలవాలంగా మారిందన్నారు. రంగనాయకసాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్, అనంతగిరి రిజర్వాయర్లతో పసిడి పం టలతో ప్రజలు నేడు సంతోషంగా ఉన్నారన్నారు.
సిద్దిపేట అద్భుతంగా ఉంది
-కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి
సిద్దిపేట పట్టణాన్ని మంత్రి హరీశ్రావు అద్భుతంగా, సుందరంగా తీర్చిదిద్దారని కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి అన్నారు. సిద్దిపేట పట్టణంతో పాటు పల్లెలు అభివృద్ధి చెందాయని ప్రశంసించారు. సిద్దిపేట పట్టణాన్ని ఉద్యానవనంలా తీర్చిదిద్దారని కొనియాడారు. ప్లాస్టిక్ వాడకంతో ప్రకృతి వినాశనం జరుగుతుందని, ఎవరూ ప్లాస్టిక్ను వాడొద్దని సూచించారు.
కొనసాగుతున్న శ్రీకృష్ణ కాలచక్రం
పట్టణంలోని వేములవాడ కమాన్ వద్ద శ్రీకృష్ణ పీఠాధిపతి కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ కాలచక్రం పేరిట నిర్వహిస్తున్న అయుత చండీ, అతిరుద్ర యాగం, సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం,78వ విశ్వశాంతి మహాయాగంలో భాగంగా గురువారం దక్షిణామూర్తి, మేదా, రామ గాయత్రీ హోమాలు చేశా రు. ఆరు యజ్ఞశాలల్లో 750 జంటలతో 800 మంది రుత్వికులతో నిర్వహించారు. హోమాలలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్, సీపీ శ్వేత పాల్గొన్నారు. గోపూజ, తులసిపూజ, సహస్ర లింగార్చన, రుద్రాభిషేకాలు, కోటి పారాయణ భజనలు, రుద్రక్రమార్చన, లక్ష బిల్వార్చన, తీర్థ ప్రసాదాలు అందజేశారు. 17 రకాలైన జప, పారాయణ, అభిషేక హోమాలు చేశారు. సుమారు 14 వేల మంది భక్తులకు అన్నదానం చేశారు.