నంగునూరు, మార్చి 7: సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు మండల కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. నంగునూరు మండల కాంగ్రెస్ నాయకులు వర్గాలు విడిపోయి ఒకరినొకరు దాడి చేసుకునే స్థాయికి చేరింది. నంగునూరు మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని రాంపూర్కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాపోలు రాజా బహదూర్రెడ్డికి నామినేటెడ్ పదవి ఖారారైనట్లు ఊహాగానాలు వినిపించాయి. దీంతో మరో కాంగ్రెస్ వర్గానికి చెందిన నాయకులకు అది మింగుడు పడలేదు. దీంతో మంగళవారం ఓపని మీద నంగునూరుకు వచ్చిన రాజాబహదూర్రెడ్డి పనిపూర్తి చేసుకుని ఓ స్థానిక నాయకుడి వద్ద కూర్చుని మాట్లాడుతుండగా..
మరో వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అతడిపై దాడిచేసి దుర్భాషలాడారు. ఇన్ని రోజులు ఎక్కడికెళ్లావు.. ఎవరు నువ్వు..అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి తిరిగారు. దీంతో చాలాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాలకు నచ్చజెప్పిన గ్రామస్తులు అక్కడి నుంచి పంపించారు. దాడికి గురైన కాంగ్రెస్ నాయకుడు రాజాబహదూర్ రెడ్డి రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో కాంగ్రెస్ నాయకులు అనరాజు నాగరాజు, చెలికాని యాదగిరి, దేవులపల్లి శ్రీకాంత్, దేవులపల్లి ప్రశాంత్, గోనెపల్లి శివప్రసాద్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కొన్ని రోజులుగా నంగునూరు మండల కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి.