సంగారెడ్డి కలెక్టరేట్/మెదక్ మున్సిపాలిటీ జూన్ 11: ఆడుతూ పాడుతూ వేసవి సెలవుల్లో సరదాగా ఎంజాయ్ చేసిన విద్యార్థులు తిరిగి పుస్తకాల సంచిని చంకనేసుకొని బడికెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ నెల 12 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు పున: ప్రారంభంకానున్నాయి. గత ఏప్రిల్ 25 నుంచి ఈ నెల 11వ తేదీ వరకు వేసవి సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 50 రోజుల తరువాత విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. జూన్ 12వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో హాస్టళ్లు కూడా విద్యార్థులతో కళకళలాడనున్నాయి. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 1,800 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 1,356 ప్రభుత్వ పాఠశాలలు, 444 ప్రైవేటు పాఠశాలలు, 5 ప్రైవేట్ ఎయిడేడ్ పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం లక్షా 28 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికీ సోమవారం నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.
జిల్లాలోని పాఠశాలల వివరాలు
కేంద్ర ప్రభుత్వ పాఠశాల 1, కేంద్రీయ విద్యాలయాలు 2, కేజీబీవీ 17, మదర్సా అన్ రికగ్నైజ్డ్ 10, మినీ గురుకులం 1, మైనార్టీ వెల్ఫేర్ 12, మహాత్మా జ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలలు 12, ఎంపీపీ, జడ్పీపీ పాఠశాలలు మొత్తం 1,220, ప్రైవేట్ ఎయిడెడ్ 5, ప్రైవేట్ అన్ఎయిడెడ్ 431, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ (సీబీఎస్ఈ) 12, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ (ఐసీఎస్ఈ) 1, రాష్ట్ర ప్రభు త్వ పాఠశాలలు 37, రాష్ట్ర ప్రభుత్వ (డీఎన్టీ) 5, టీఎస్ మోడల్ స్కూల్స్ 10, టీఎస్ సోషల్ వేల్ఫేర్ గురుకులాలు 11, టీఎస్ ట్రైబల్ వెల్ఫేర్ 6, టీఎస్ఆర్ఈఐ సొసైటీ స్కూల్స్ 2, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు 4, ఒక అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల ఉన్నాయి.