సిద్దిపేట అర్బన్, జనవరి 20: ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) పాత్ర కీలకమైంది. ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులతో ఏర్పాటు చేసే ఈ కమిటీల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రు లు ఎన్నికల్లో పాల్గొనేలా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏర్పాట్లు చే యనున్నారు. సిద్దిపేట జిల్లాలోని 638 ప్రాథమిక, 115 ప్రాథమికోన్నత పాఠశాలలు, 227 ఉన్నత పాఠశాలలు, 14 మోడల్ స్కూళ్లు, 22 కేజీబీవీలు, 36 రెసిడెన్షియల్ పాఠశాలలు, 2 ఎయిడెడ్ పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎన్నికలకు ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో మొత్తం 1054 ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికలు జరుగనున్నాయి.
ఈ నెల 29న జరుగనున్న ఎన్నికలు
స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రుల ఓటరు జాబితాను పాఠశాల నోటీస్ బోర్డులో ప్రదర్శించారు. ఈ నెల 22 నుంచి 23వ తేదీ వరకు తల్లిదండ్రుల ఓటరు జాబితాపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఈ నెల 24న తుది ఓటరు జాబితాను నోటీస్ బోర్డుపై ప్రదర్శిస్తారు. ఈ నెల 29వ తేదీ ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు నిర్వహించి మధ్యాహ్నం 1.30 గంటలకు కొత్త చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. అదే రోజు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, వైస్చైర్మన్లతో సమావేశం నిర్వహిస్తారు.
కమిటీ ఎన్నిక జరిగే విధానం
ఎన్నిక జరిగే రోజు 50 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుంది. చేతులెత్తే పద్ధతి లేదా వాయిస్ ఓటు ద్వారా ఎన్నికలు నిర్వహిస్తారు. చైర్మన్, వైస్ చైర్మన్ సహా ఒక్కో తరగతి నుంచి ముగ్గురు ఎన్నికైన తల్లిదండ్రులు సభ్యులుగా ఉంటారు. ఇందులో ప్రతి ముగ్గురిలో ఇద్దరు మహిళలు ఉండాలి. వీరితో పాటు మరో ఐదుగురు ఎక్స్ అఫీషియో సభ్యులుగా, ఇద్దరు కోఆప్టేడ్ సభ్యులు ఉంటారు. ప్రధానోపాధ్యాయుడు మెంబర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. అయితే ప్రతి పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రమే సభ్యులుగా ఉంటారు. 9,10వ తరగతుల్లోని విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ కమిటీల్లో అవకాశం కల్పించరు. ఎన్నికైన కమిటీ రెండేండ్ల పాటు పదవిలో ఉంటుంది.