తొగుట, ఆగస్టు 27 : పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. శనివారం తొగుట మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో లబ్ధిదారులకు ఆసరా కార్డులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తొగుట మండలంలో ఇప్పటికే 7009 ఆసరా పింఛన్లు ఉండగా, అదనంగా 853 మందికి ఇస్తున్నామన్నారు. బీజేపీ ప్రభుత్వ మాటలు కోటలు దాటుతాయని, చేతలు మాత్రం చేయి దాటదని ఎద్దేవా చేశారు.
ఉచితాలు బంద్ చేయాలని చెప్పడం సిగ్గుచేటుగా ఉందన్నారు. ఎన్నికల హామీ మేరకు 57ఏండ్లు నిండిన వారికి పింఛన్లు ఇస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి లేని లోటును తీరుస్తున్న మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి చేస్తున్న కృషిని మంత్రి హరీశ్రావు కొనియాడారు. ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గం మరింత అభివృద్ధి వైపు దూసుకెళ్తున్నదన్నారు. ఎమ్మెల్యే లేకున్నా ఎంపీ ప్రభాకర్రెడ్డి ఉండడంతో దుబ్బాక నియోజకవర్గం మరింత అభివృద్ధి జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. గత ఉప ఎన్నికల్లో ప్రజలకు హామీలిచ్చిన నాయకులు, ఎన్నికల తర్వాత ప్రజల మధ్య లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీలు, కలెక్టర్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఆర్డీవో అనంతరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్, టీఆర్ఎస్ తొగుట మం డల అధ్యక్షుడు రాంరెడ్డి పాల్గొన్నారు.