కొమురవెల్లి, డిసెంబర్ 11: పశువుల ఎరువుకు డిమాండ్ పెరిగింది. యాసంగి సీజన్ కోసం ముందస్తుగా పశువుల పేడను పంట పొలాల్లో వేసే పనుల్లో రైతులు బీజీగా ఉన్నారు. పశుసంపద తగ్గడంతో సేంద్రియ ఎరువుల కొరత ఏర్పడింది. దీంతో రైతులు దూర ప్రాంతాలకు వెళ్లి అధిక ధరకు కొనుగోలు చేస్తూ తమ పంట పొలాలకు తరలిస్తున్నారు.
వేలాది రూపాయలు వెచ్చించి..
ఎరువుల ధరలు ఆకాశానంటుతున్నాయి. ఆయా గ్రామాల్లో పశువుల ఎరువు లభ్యం కాకుండే సరిహద్దు గ్రామాలకు వెళ్లి పశువుల ఎరువును రైతులు కోనుగోలు చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్కు రూ. 5వేల నుంచి రూ. 50వేలు చెల్లించి కొంటున్నారు. దానికి తోడు ట్రాక్టర్ కిరాయి సైతం అదనంగా చెల్లించాల్సి వస్తుంది.
భూసారం పెరుగుదల..
పంట పొలాల్లో భూసారం పెరిగేందుకు సేంద్రియ ఎరువులు ఉపయోగపడుతాయి. వరి, మొక్కజొన్న, సజ్జలు, నువ్వులు, వేరుశెనగ, కూరగాయలు పంటలను రైతులు ఎక్కువగా పండిస్తారు. భూసారం పెరగడానికి పశువుల పేడ, చెరువు మట్టి చల్లుతారు. ధర పెరిగినప్పటికీ దిగుబడి ఆధికంగా వస్తుండటంతో రైతులు కొనుగోలు చేస్తున్నారు.
తగ్గిన పశుసంపద
సేంద్రియ ఎరువుకు డిమాండ్ పెరగడానికి కారణం పశు సంపద కొరతే ప్రధాన కారణం. వ్యవసాయంలోకి ఆధునిక యంత్ర పరికరాల ప్రవేశంతో ఎద్దులు కనుమరుగయ్యాయి. పశుగ్రాసం దొరకక గెదేలు, ఆవులు సైతం పల్లెల్లో కనిపించడం లేదు. దీంతో రైతులకు పేడ నిల్వచేసే పరిస్థితి లేకుండా పోయింది.
సేంద్రియ ఎరువుల కొరత ఉంది
సేంద్రియ ఎరువుల కొరత ఉంది. పశువులు లేకపోవడంతో ధరలు బాగా ఉన్నప్పటికీ ఎరువులు ఎక్కడ ఉంటే అక్కడికెళ్లి, పశువుల ఎరువును కొంటున్నాం. పంట పొలాల్లో చల్లుతున్నాం. భూసారం పెరిగి పంటలకు ఎంతో ఉపయోగపడడంతో పాటు అధిక దిగుబడులు వస్తాయి.
– బచ్చల కొండయ్య, రైతు, గురువన్నపేట
సేంద్రియ ఎరువుతో అధిక దిగుబడులు
సేంద్రియ ఎరువులతో రైతులకు అధిక దిగుబడులు వస్తాయి. సేంద్రియ ఎరువులు వాడడంతో భూమి కూడా సారవంతం అవుతుంది. ఫర్టిలైజర్స్ కంటే సేంద్రియ ఎరువులతో చేసే వ్యవసాయానికి పెట్టుబడి తక్కువ కావడంతో పాటు దిగుబడి పెరుగుతుంది. సేంద్రియ ఎరువులతో పండించిన పంటలకు ఎక్కువ డిమాండ్ ఉండడంతో రైతులకు లాభాలు ఎక్కువగా వస్తాయి.
– మరుపాక నరేశ్, మండల వ్యవసాయశాఖ అధికారి, కొమురవెల్లి