సంగారెడ్డి అర్బన్, జూన్ 8 : తెలంగాణ ఏర్పాటు తర్వాత సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలంగా మారిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని చిమ్నాపూర్ గ్రామంలో గురువారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చెరువుల పండుగ నిర్వహించారు. కార్యక్రమానికి సీఎస్ శాంతికుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో తాను జిల్లాలో నాలుగు సంవత్సరాలకు పైగా జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి కలెక్టర్ పీడీ, డీఆర్డీవో, సీఈవో జిల్లా పరిషత్ వరకు అన్ని పోస్టుల్లో ఇక్కడే పనిచేశానని గుర్తు చేశారు. అన్ని గ్రామాలు కనీసం రెండు మూడు సార్లు తిరిగానని, అయితే రెండు గ్రామాల ప్రజలు కలిసి ఇంత మంది ఒక చోట చేరి కనులపండువగా ఇంత పెద్ద పండుగ చేసుకోవడం తాను ఎప్పుడూ చూడలేదన్నారు. గతంలో మెదక్ జిల్లా కరువు కాటకాలకు నిలయంగా ఉండేదని, వేసవి కాలం వస్తే ఎక్కడ బోర్లు ఎండి పోతే అక్కడ ట్యాంకర్లు పెట్టి నీళ్లు అందించేందుకు మేమంతా పరిగెత్తే వాళ్లమని తెలిపారు. కొన్ని గ్రామాల్లో ఎడ్లబండ్లు పెట్టి నీటిని సరఫరా చేశామన్నారు. కానీ, వేసవికాలంలో కూడా చెరువులు ఇట్లా నిండిపోయి నీటితో కళకళలాడుతాయని తానెప్పుడూ ఊహించలేదన్నారు.
తూములు,అలుగులు అన్నీ రిపేర్ చేసుకోవడం వల్ల నీళ్లు నిండి రెండు పంటలు పండిన తర్వాత కూడా చెరువుల్లో నీళ్లు ఉంటున్నాయన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఇప్పుడు మూడు జిల్లాలు అయిన తర్వాత ఒక్క సంగారెడ్డి జిల్లాలో పండించిన ధాన్యం పెట్టుకోవడానికి సరిపోవడంలేదన్నారు. చెరువుల పండుగ ఇంత బాగా జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రాబోయే 14 రోజులు ప్రతి రోజూ పండుగ జరుపుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయం అనేది ఒక పండుగ అని చెప్పి ఇంత తక్కువ కాలంలో రూ. వందల కోట్లు ఖర్చు చేసి చెరువులు బాగు చేశారన్నారు. ఈ ఉత్సవాల్లో తనను భాగస్వాములు చేసినందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్, టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, జేసీ వీరారెడ్డి, డీఆర్వో నగేష్, జడ్పీటీసీ కొండల్రెడ్డి, కంది సర్పంచ్ విమల వీరేశం, ప్రమీల, ప్రకాశ్, ఆత్మకమిటీ చైర్మన్ కృష్ణాగౌడ్ పాల్గొన్నారు.