మెదక్ జిల్లాలో సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని గిరిజన తండాల్లో ఘనంగా గురువారం నిర్వహించారు. గిరిజన మహిళలు బోనాలతో సేవాలాల్ ఆలయాలకు చేరుకుని భోగ్భండార్ పూజలు చేశారు. తమ ఆచార వ్యవహారాల్లో భాగంగా అమ్మవారు జగదాంబికా మాత, సేవాలాల్ మహరాజ్కు మంగళహారతులు, నైవేద్యాలు, హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. మహిళలు తెల్లవారుజాము నుంచే తండాల్లో ఒక్కచోటుకు చేరుకుని పాటలు పాడుతూ మహరాజ్ చిత్రపటాన్ని ర్యాలీగా ఊరేగించారు. అనంతరం అన్నదానం నిర్వహించి, సహపంక్తి భోజనాలు చేశారు.
మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 15 : సేవాలాల్ మహరాజ్ గొప్ప సంఘ సంస్కర్త, తన బోధనలతో బంజారాలను సన్మార్గం లో నడిపించిన మహనీయుడని అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. బంజారాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి పురస్కరించుకుని గురువారం జిల్లా కేంద్రంలోని మీరానగర్లో ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక మార్గంలోనే కాకుండా బంజారాల హక్కుల కోసం నిజాం, మైసూర్ పాలకులకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో సేవాలాల్ కీలక పాత్ర పోషించారన్నారు. బంజారా భాషకు ఒక రీతిని సమకూర్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. బంజారాలు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆలరిపంచాయి. ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు, జిల్లా మైనింగ్ అధికారి జయరాజు, జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమాధికారి విజయలక్ష్మి, తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.