బీఆర్ఎస్ పాలనలో పచ్చదనం, పరిశుభ్రత, స్వచ్ఛతతో అలరారిన గ్రామాలు, నేడు కళావిహీనంగా మారుతున్నాయి. కొన్ని నెలలుగా పంచాయతీలకు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో పల్లెపాలన పడకేసింది. పారిశుధ్య నిర్వహణ సరిగ్గా జరగడం లేదు. పంచాయతీ పారిశుధ్య సిబ్బందికి వేతనాలు రావడం లేదు. డీజిల్కు డబ్బులు లేక చెత్త సేకరణ ట్రాక్టర్లు మూలకు పడ్డాయి.
డంపు యార్డులు కంపుకొడుతున్నాయి. హరితహారం మొక్కలు ఎండిపోతున్నాయి. మళ్లీ పాతరోజులు వస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలో 499, మెదక్ జిల్లాలో 469, సంగారెడ్డి జిల్లాలో 647 గ్రామ పంచాయతీలు కలిపి మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో 1615 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతినెలా పల్లెప్రగతి నిధులు విడుదల చేసి పల్లెల
సర్వతోముఖాభివృద్ధికి పాటుపడింది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు దానిని విస్మరించడంతో గ్రామీణులు
సమస్యల బారినపడుతున్నారు.
సిద్దిపేట, మే 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ సంగారెడ్డి (నమస్తే తెలంగాణ): కేసీఆర్ పాలనలో కళకళలాడిన పంచాయతీలు, కాంగ్రెస్ పాలనలో వెలవెలబోతున్నాయి. నిధులు లేక నీరసించిపోతున్నాయి. ప్రభు త్వం పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు కుంటుపడడంతో పాటు పారిశుధ్య పనులు అటకెక్కాయి. కేసీఆర్ ప్రభుత్వం ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, నీటి ట్యాంకర్ ఏర్పాటు చేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లో పంచాయతీలు ట్రాక్టర్ ఈఎంఐలు చెల్లించలేని దుస్థితి నెలకొంది. చాలా పంచాయతీల్లో ట్రాక్టర్లలో డీజిల్ పోయించేందుకు నిధులు లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. చెత్తసేకరణ, డంప్యార్డుకు చెత్త తరలించేందుకు ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. డీజిల్ పోయించేందుకు డబ్బులు లేకపోవడంతో చెత్తసేకరణ అటకెక్కింది.
పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందికి నాలుగు నెలలుగా వేతనాలు అందక పారిశుధ్య పనులు సరిగ్గా జరగడం లేదు. దీంతో గ్రామాల్లో పారిశుధ్య సమస్య నెలకొంది. కేసీఆర్ ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలోని 647 పంచాయతీల్లో 647 వైకుంఠధామాలు, 647 కంపోస్టు షెడ్లు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలను నిర్మించింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటి నిర్వహణను గాలికి వదిలేసింది. హరితహారం అమలుపై ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారులకు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదు.
దీంతో హరితహారం కొనసాగింపుపై అనుమానాలు నెలకొన్నాయి. గ్రామాల్లో నర్సరీలు, రోడ్డుపక్కన నాటిన మొక్కలకు నీళ్లు పోయకపోవటంతో ఎండిపోతున్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం మొక్కలను కాపాడుకునేందుకు ప్రత్యేకంగా గ్రీన్ బడ్జెట్ కేటాయిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ దానిని విస్మరించింది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో నిధులు లేక పంచాయతీలు నీరసిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో 647 పంచాయతీలు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వక పోవడంతో పంచాయతీలు పూర్తిగా జనరల్ ఫండ్పైనే ఆధార పడుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో జిల్లాలోని 647 పంచాయతీలకు ప్రభుత్వం పల్లెప్రగతి ద్వారా నిధుల కేటాయించింది. గత పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం పల్లె ప్రగతి ద్వారా 647 పంచాయతీలకు రూ.518.74 కోట్ల నిధులు విడుదల చేసింది. ఇవి కాకుండా 14వ ఆర్థిక సంఘం నిధులు, ఎస్సీ,ఎస్టీ కాంపోనెంట్ నిధులు ప్రత్యేకంగా వచ్చేవి. దీంతో గ్రామాల్లో అభివృద్ధి జరిగేవి. ఇవికాకుండా కేసీఆర్ సర్కార్ ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ను అందజేసింది.
పంచాయతీ సిబ్బందికి ప్రతినెలా వేతనాలను కేసీఆర్ సర్కార్ చెల్లించేది. దీంతో పంచాయతీలు ఎలాంటి సమస్యలు లేకుండా సమగ్ర అభివృద్ధ్దితో కళకళలాడాయి. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎఫ్సీ ద్వారా 647 పంచాయతీలకు ఇప్పటి వరకు నిధులు కేటాయించలేదు. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేయలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.50 నుంచి రూ.100 కోట్లకుపైగా నిధులు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు పైసా రాలేదు. దీంతో జిల్లాలోని పంచాయతీలు జనరల్ ఫండ్ నిధులను ఖర్చు చేస్తున్నాయి. జనరల్ ఫండ్లో ఎక్కువగా ఇంటిపన్ను నుంచి నిధులు వస్తున్నాయి.
జిల్లాలో 647 మైనర్ పంచాయతీలు ఉండగా, 300కు పైగా మేజర్ పంచాయతీలు ఉన్నాయి. మిగతా 300 పంచాయతీలు చిన్నవి, ఇక్కడ జనరల్ ఫండ్ తక్కువగా ఉంటుంది. దీంతో ఆయా పంచాయతీల్లో సమస్యలు నెలకొంటున్నాయి. జిల్లాలోని 647 పంచాయతీల్లో ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు ఉన్నాయి. 240 పంచాయతీలు ప్రతినెలా ట్రాక్టర్ల ఈఎంఐలు చెల్లిస్తున్నాయి. 240 పంచాయతీల్లో 127 పంచాయతీల్లో గత ఐదు నెలలుగా ట్రాక్టర్ల ఈఎంఐలు చెల్లించలేని పరిస్థితి ఉంది. 200కు పైగా పంచాయతీల్లో ట్రాక్టర్లలో డీజిల్ పోయించలేని పరిస్థితి ఉంది. సర్పంచ్లు ఉన్న సమయంలో పెట్రోలు బంకుల్లో ఖాతాలు పెట్టి ట్రాక్టర్లలో డీజిల్ పోయించేవారు.
పంచాయతీల్లో డబ్బులు ఉన్నప్పుడు చెల్లించేవారు. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులు ఉండడంతో పెట్రోలు బంక్ల యజమానులు డబ్బులు చెల్లిస్తేనే పోస్తామని పట్టుబడుతున్నారు. దీంతో 200కుపైగా పంచాయతీల్లో ట్రాక్టర్లు డీజిల్ లేక నడవని పరిస్థితి ఉంది. దీంతో చెత్తసేకరణ, పారిశుధ్య పనుల్లో సమస్యల తలెత్తుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని 647 పంచాయతీల్లో 3042 మంది పారిశుధ్య సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి ప్రతినెలా వేతనాలు చెల్లించాలి. మేజర్ పంచాయతీల్లో ప్రతినెలా 20వ తేదీ తర్వాత వేతనాలు చెల్లిస్తున్నారు. చిన్న పంచాయతీల్లో నిధులు కొరత కారణంగా నాలుగు నెలలుగా పారిశుధ్య సిబ్బందికి వేతనాలు చెల్లించడం లేదు.
దీంతో గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సరిగ్గా జరగడం లేదు. ప్రభుత్వం మొదట కరెంటు బిల్లులు చెల్లించాలని చెబుతుండడంతో పంచాయతీ కార్యదర్శులు జనరల్ ఫండ్ నిధుల నుంచి మొదట కరెంటు బిల్లులు చెల్లించేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప పారిశుధ్య సిబ్బందికి వేతనాలు చెల్లించడం లేదు. గ్రామాల్లో చెత్త తొలిగించక పోవడం, సేకరించకపోవడం, మురుగు కాల్వలు శుభ్రం చేయకపోవడంతో పారిశుధ్య సమస్య నెలకొని ప్రజారోగ్యంపై ప్రభావం చూపనున్నది. సర్కారు నిధులివ్వక పోవడంతో తామేమీ చేయలేకపోతున్నామని పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేకాధికారులు పేర్కొంటున్నారు. దీంతో కాంగ్రెస్ సర్కారు తీరుపై గ్రామీణులు పెదవి విరుస్తున్నారు.
మాకు ఐదు నెలల సంది జీతాలు అస్తలేవు. పంచాయతీలో పనిచేసినా మా బతుకులు మారడం లేదు. ప్రభుత్వం మాకు జీతాలు ఇచ్చి ఆదుకోవాలి. లేకుంటే మా బతుకులు రోడ్డున పడ్తయి. జీతం వస్తేనే మా కుటుంబం నడుస్తుంది. లేకుంటే పస్తులుండుడే. గీ కాంగ్రెస్ సర్కారు మమ్మల్ని పట్టించుకోవాలి.
-నర్సింహులు, పారిశుధ్య కార్మికుడు, శివ్వాయపల్లి, రామాయంపేట (మెదక్ జిల్లా) జీతం వస్తేనే
జీతాలు ఐదు నెలల నుంచి ఆగిపోవడంతో కిరాణా దుకాణాల్లో అప్పులు పెరిగి పోతున్నాయి. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. జీతాలను ఇప్పుడిస్తాం అప్పుడిస్తాం అంటూ నెలలు గడుపుతున్నారు. నెలనెల జీతం రాకుంటే మా కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారింది.
-మల్లవ్వ, పారిశుధ్య కార్మికురాలు, శివ్వాయపల్లి, రామాయంపేట మండలం