హత్నూర, అక్టోబర్ 6 : హత్నూర మండలం కాసాల గ్రామపంచాయతీ వార్డుసభ్యులు తమ పదవికి చేసిన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. ఇటీవల తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరుగడంలేదని ఆరోపిస్తూ కాసాల గ్రామపంచాయతీకి చెందిన 9మంది వార్డుసభ్యులు తమ పదవికి రాజీనామాచేస్తున్నట్లు ప్రకటించి పంచాయతీ కార్యదర్శికి తమ రాజీనామా లేఖను అందజేశారు.
దీంతో బుధవారం స్థానిక ఎమ్మెల్యే మదన్రెడ్డి వార్డు సభ్యులతో చర్చించి గ్రామాభివృద్ధికి కృషిచేసి నిధులు మంజూరుచేస్తానని వార్డుసభ్యులకు నచ్చజెప్పడంతో వారు తమ రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు టీఆర్ఎస్ మండలపార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి తెలిపారు.