అందోల్, అక్టోబర్ 27 : గత ప్రభుత్వాలకు భిన్నంగా కేవలం ప్రజలకోసమే పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. ఈ విషయాన్ని గ్రామాల్లోన్ని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సూచించారు.
బుధవారం అందోల్లోని ఓ ఫంక్షన్హాల్లో పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడిరాష్ట్రంలో పాలించిన నేతలు దోచుకో..దాచుకో అనే నినాదంతో పని చేశారని గుర్తుచేశారు. కానీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమంకోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు.
దీన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లే బాధ్యత పార్టీ శ్రేణులదేనని ప్రజా ప్రతినిధులు, నాయకులు ఈ విషయంపై మరింత దృష్టి పెట్టాలన్నారు. గత ప్రభుత్వాలు చేపట్టే ప్రతి అభివృద్ధి, సంక్షేమ పథకాలను పార్టీ నేతలకే ఇచ్చేవారని కానీ మన ప్రభుత్వం అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమఫలాలు అందిస్తున్నదనే విషయం గుర్తిచేలా అవగాహన చేపట్టాలన్నారు.
ప్రభుత్వంపై గానీ..సీఎంపై గానీ ప్రతిపక్షాల నేతలు చేసే విమర్శలను సమర్ధంగా తిప్పికొట్టాలన్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతీ కార్యకర్తకు, నాయకులకు తప్పకుండా సరైన గుర్తింపు ఉంటుందని, ఈ విషయంలో ఏవరు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు.
అనంతరం నియోజకవర్గలోని వివిధ మండలాలకు చెందిన పలు పార్టీల నాయకులు ఎమ్మెల్యే సమక్ష్యంలో పార్టీలో చేరగా పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.