జిన్నారం (సంగారెడ్డి) : రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా అమలు కావడం లేదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి (Mla Mahipal reddy) అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత(Dalit) , మైనార్టీ , బీసీ బంధు , గృహలక్ష్మి (Griha Laxmi) పథకాలు విప్లవాత్మకమైనవని పేర్కొన్నారు.
దళిత బంధు(Dalitbandu) పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్ధరహితమైనవని ఆరోపించారు. శనివారం ఎంపీపీ రవీందర్గౌడ్ అధ్యక్షతన జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల జీవితాలలో కొత్త వెలుగులు నింపేందుకే ప్రభుత్వం పలు పథకాలను తీసుకొచ్చిందన్నారు.
ఈ పథకాలకు అర్హులైన వారిని ఎంపిక చేస్తూ విడతల వారీగా అమలు చేస్తుందని వెల్లడించారు. ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారాలు చేయడం సిగ్గు చేటన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్(CM KCR) అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయడం చేతకాక విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వం అందించే నిధులతో పాటు సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు.