సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 26: విద్యార్థి కేంద్రంగా విద్యాభివృద్ధి చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన అన్నారు. సంగారెడ్డి జిల్లాలో రెండు రోజులగా నిర్వహించిన ఎఫ్ఎల్ఎన్ శిక్షణ శనివారం ముగిసింది. జిల్లా సైన్స్ కేంద్రంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయులు పాటించాల్సిన మెళకువలను వివరించారు. వెనుకంజలో ఉన్న విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఎప్పటికప్పుడు పాఠశాలల పర్యవేక్షణ చేయాలని డీఈవోను ఆదేశించారు. అనంతరం జిల్లా సైన్స్ కేంద్రాన్ని పాఠశాల విద్యా డైరెక్టర్ సందర్శించారు. సైన్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఆయా వైజ్ఞానిక అంశాలపై ఆరా తీశారు. విద్యార్థుల వైజ్ఞానిక అభివృద్ధికి మ్యూజియం దోహదం చేస్తుందని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాలోనూ ఇలాంటి సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీడీ గాజర్ల రమేశ్, డీఈవో నాంపల్లి రాజేశ్, జిల్లా సైన్స్ అధికారి విజయ్కుమార్, ఉప విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పటాన్చెరులో..
మండలంలోని ఇస్నాపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్పీడీ దేవసేన శనివారం సందర్శించారు. పాఠశాలలో మన ఊరు, మనబడిలో పనుల నాణ్యత పరిశీలించారు. పిల్లల అవగాహన కోసం వేసిన రంగుల చిత్రాలను నిశితంగా గమనించారు. అక్కడక్కడ కనిపించిన పొరపాట్లను సరిదిద్దాలని అధికారులు, కాంట్రాక్టర్కు ఆదేశించారు. క్లాసుల్లోకి వెళ్లి టీచర్లు చెబుతున్న పాఠాలు విన్నారు. విద్యార్థులతో బోర్డుపై రాయించారు. పలు ప్రశ్నలు వేసి వాటి జవాబులను బోర్డుపై రాయాలని కోరగా, విద్యార్థులు తప్పులు లేకుండా రాయడంతో ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందజేసేందుకు ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం నిర్వహిస్తున్నదన్నారు. విద్యార్థులు చదవడం, రాయడంతో పాట పాఠాలను అర్థం చేసుకోవడం ముఖ్యమన్నారు. పాఠశాలలో నిర్మించిన టాయిలెట్స్ పరిశీలించారు. ఆమెతో ఏఎస్పీడీ రమేశ్, డీఈవో నాంపల్లి రమేశ్, ఎంఈవో పీపీ రాథోడ్, సర్పంచ్ గడ్డం బాలామణి, ఎంపీటీసీ గడ్డం శ్రీశైలం, ఉప సర్పంచ్ శోభా కృష్ణారెడ్డి, ఇన్చార్జి హెచ్ఎం శుభరత్నం, కళావతి, ఆనంద్, శేషాద్రి, యాదగిరి పాల్గొన్నారు.