రామచంద్రాపురం,నవంబర్25: కొల్లూర్లోని ప్లాట్లకు సంబంధించిన భూములకు పాస్బుక్కులు జారీ చేయవద్దని కొల్లూర్ లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు జిల్లా కలెక్టర్ శరత్ను కోరారు. లక్ష్మీపురం ప్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఎం.సత్తయ్య, నర్సింహమూర్తి, సుబ్రహ్మణ్యం, రామ్మోహన్రావు, మల్లేశ్, శ్రీకాంత్రెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ను కలిసి వినతిపత్రం అందజేశారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూర్లో సర్వేనంబర్లు 172 నుంచి 175, 180 నుంచి 190 వరకు ఉన్న భూములను దాదాపుగా 40 సంవత్సరాల క్రితం మధుసూదన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, రఘునందన్రెడ్డి రైతుల నుంచి జీపీఏ చేయించుకొని ప్లాట్లు చేసి అమ్మకాలు చేశారన్నారు. అప్పట్లో పైసా పైసా కూడబెట్టుకొని పిల్లల భవిష్యత్ కోసం అందులో ప్లాట్లను కొనుగోలు చేశామన్నారు. 2002, 2003లో ప్లాట్లు చేసి విక్రయించిన భూములను తిరిగి జీపీఏ దారులు నాథేళ్ల ఎస్టేట్కు వ్యవసాయ భూమిగా చూపించి అమ్మివేశారని, అప్పటి నుంచి భూమి వివాదంలోకి వెళ్లిందని తెలిపారు. నాథేళ్ల ఎస్టేట్ సంస్థ వారు అనుచరులతో వచ్చి ప్లాట్ ఓనర్స్పై బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని అసోసియేషన్ సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ భూములకు సంబంధించి సదరు సంస్థ పాస్ బుక్కుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయా సర్వేనంబర్లకు సంబంధించిన భూములకు పాస్ బుక్కులు జారీ చేయవద్దని, ప్లాట్ ఓనర్స్కు న్యాయం చేయాలని కలెక్టర్ను వారు కోరారు.