సంగారెడ్డి, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోనే పరిశ్రమలకు పెట్టుబడుల ధామంగా మారుతున్నది సంగారెడ్డి జిల్లా. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాల ద్వారా రాష్ర్టానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. రాజధాని నగరం హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉం డడం, రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఐపాస్ ద్వారా నిర్ణీత సమయంలోనే అనుమతులు ఇస్తుండడంతో జిల్లాకు పెద్ద ఎత్తు న పెట్టుబడులు వస్తుండడంతో సంగారెడ్డి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంది. జిల్లాలో పారిశ్రామిక రంగంలో పరుగులు పెట్టడంతోపాటు యువతకు స్థానికంగా ఉద్యోగాలు, ఉపాధి లభిస్తున్నాయి. ఫార్మా, లైఫ్సైన్సెస్, డిఫెన్స్, ఆటో మొబైల్, ఫుడ్ప్రాసెసింగ్, ఇంజినీరింగ్ రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. వీటితోపాటు సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు సైతం పెద్ద సంఖ్యలో ఏర్పాటు అవుతున్నాయి.
పారిశ్రామిక పెట్టుబడుల్లో మనమే టాప్
పారిశ్రామిక పెట్టుబడుల్లో రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉన్నది. 2015 నుంచి టీఎస్ఐపాస్ ద్వారా జిల్లాలో 1730 పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు లభించినట్లు అధికారుల లెక్కల చెబుతున్నాయి. రూ.19,328 కోట్ల పెట్టుబడులు జిల్లాకు తరలివచ్చాయి. ఇందులో రూ.100 కోట్లకుపై పెట్టుబడులతో ఏర్పాటైన మెగా, భారీ పరిశ్రమలు 43 ఉన్నాయి. రూ.10 నుంచి రూ.100 కోట్ల లోపు పెట్టుబడులతో ఏర్పాటైన కంపెనీలు 168 ఉన్నాయి. రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకు పెట్టుబడులతో జిల్లాలో 859 మంది చిన్నతరహా పరిశ్రమలు, రూ.25 లక్షల నుంచి రూ.5 కోట్ల లోపు పెట్టుబడులతో 460 సూక్ష్మ తరహా పరిశ్రమలు జిల్లాలో ఏర్పాటయ్యాయి. సదాశివపేట సమీపంలోని అంకెనపల్లిలో ఎంఆర్ఎఫ్ కంపెనీ రూ.1,837 కోట్ల పెట్టుబడితో కొత్త యూనిట్ను ప్రారంభించింది. జహీరాబాద్ సమీపంలోని గోవిందాపూర్లో హాట్సన్ కంపెనీ రూ.286 కోట్ల పెట్టుబడులతో ఐస్క్రీమ్ ఫ్యాక్టరీని, మహీంద్రా కంపెనీ రూ.250 కోట్ల పెట్టుబడితో జహీరాబాద్లో ఫోర్వీల్ ప్యాసింజర్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేసింది.
ఫార్మా కెమికల్స్కు సంబంధించి కోవలెంట్ ల్యాబోరేటరీస్ రూ.708 కోట్లు, పిరమల్ ఫార్మా కంపెనీ రూ.468 కోట్లు, అరబిందో ఫార్మా కంపెనీ రూ.641 కోట్లతో కొత్త యూనిట్లను ఏర్పాటు చేశాయి. కార్వీ సోలార్ పవర్ సంస్థ రూ.151 కోట్లు, అక్షయ్ ఊర్జా కంపెనీ రూ.169 కోట్లు, సుప్రసన్న సోలార్ కంపెనీ రూ.128 కోట్లు, ఓమిక్స్ ఇంటర్నేషనల్ కంపెనీ రూ.181 కోట్లు, ఏవీఆర్ ఆర్గానిక్స్ ప్రైవేట్లిమిటెడ్ రూ.121 కోట్లు, అరబిందో ఇన్ఫ్రా కంపెనీ రూ.120 కోట్లు, మైసీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.111 కోట్లు, భారతి ఎలక్ట్రికల్స్ రూ.95 కోట్లు పెట్టుబడులు పెట్టాయి. వీటితోపాటు పలు కంపెనీలు జిల్లాలో పెట్టబడులు పెట్టి పరిశ్రమలు ఏర్పాటు చేశాయి. జిల్లాలో ఏర్పాటైన 1730 పరిశ్రమల ద్వారా 1,37,057 మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి.
జిల్లాకు తలమానికంగా నిమ్జ్, మెడికల్ డివైజ్ పార్కు
పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించి జిల్లాకు తలమానికంగా జాతీయ పెట్టుబడుల ఉత్పాతక మండలి (నిమ్జ్), మెడికల్ డివైజ్ పార్కులు మారాయి. జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లోని 12,635 ఎకరాల్లో ప్రభుత్వం నిమ్జ్ ఏర్పాటు చేస్తున్నది. నిమ్జ్కు కోట్లాది పెట్టుబడులతో త్వరలో పరిశ్రమలు తరలిరానున్నాయి. నిమ్జ్లో తొలిపరిశ్రమకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ జూన్ మాసంలో శంకుస్థాపన చేశారు. నిమ్జ్లో రూ.1,000 కోట్ల పెట్టుబడితో 511 ఎకరాల్లో సమీకృత రక్షణ ఉత్పత్తుల పరిశ్రమ (ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్ ఫెసిలిటీ) ఏర్పాటు కానున్నది. ఈ పరిశ్రమలో మానవరహిత విమానాలు, హెలికాప్టర్లు, క్షిపణులు, నౌకాదళ యంత్రాలు, రాడార్ల ఉత్పత్తి జరగనున్నది. ఇదిలాఉంటే నిమ్జ్లో రూ.2,100 కోట్ల పెట్టుబడితో టైటాన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ ఏర్పాటు కానున్నది. ఇందుకు సంబంధించి టైటాన్ ఈవీ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. త్వరలోనే పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన జరగనున్నది.
నిమ్జ్లో ఇంజినీరింగ్, డిఫెన్స్, ఆటోమొబైల్ రంగానికి సంబంధించి పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. నిమ్జ్ ఏర్పాటుతో సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక రంగంలో అగ్రస్థానానికి చేరుకోనున్నది. ఇదిలాఉంటే రాష్ట్ర ప్రభుత్వం పటాన్చెరు సమీపంలోని సుల్తాన్పూర్లో మెడికల్ డివైజ్ పార్కు ఏర్పాటు చేసింది. మెడికల్ డివైస్పార్కులో రూ.1424 కోట్లతో 50 పరిశ్రమల ఏర్పాటు కానున్నాయి. పరిశ్రమల ఏర్పాటుతో 7వేల మందికి ప్రత్యక్షంగా, 15వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. గత ఏడాది డిసెంబర్ మాసంలో పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ రూ.265 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన ఏడు కంపెనీలను ప్రారంభించారు. మెడికల్ డివైజ్ పార్కులోనే ఈ ఏడాది ఏప్రిల్లో రూ.530 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన సహజానంద మెడికల్ టెక్నాలజీస్ (ఎస్ఎంటీ) స్టంట్స్ తయారీ, పరిశోధన పరిశ్రమను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సహజానంద మెడికల్ టెక్నాలజీ మాన్యుఫ్యాక్చరింగ్ ఆండ్ రిసెర్స్ యూనిట్ ఏర్పాటుతో 300 మంది సైంటిస్టులు, 2వేల మంది స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం జిన్నారం మండలం శివనగర్లో కొత్తగా ఎల్ఈడీ పార్కును ఏర్పాటు చేస్తోంది. శివనగర్లోని సర్వే నెంబరు 114లో ఉన్న 120 ఎకరాల విస్తీర్ణంలో ఎల్ఈడీ పార్కు ఏర్పాటు కానున్నది. ఇందులో వంద వరకు పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.
టీఎస్ఐపాస్ ద్వారా అనుమతులు
జిల్లాలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు టీఎస్ఐపాస్ ద్వారా అనుమతులు ఇవ్వటం జరుగుతుంది. సంగారెడ్డి జిల్లాలో టీఎస్ఐపాస్ ద్వారా ఇప్పటి వరకు 1730 కంపెనీలకు అనుమతులు ఇవ్వగా, వీటి ద్వారా జిల్లాకు రూ.19,328 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 1.37 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పూర్తి పారదర్శకంగా టీఎస్-ఐపాస్ ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇవ్వటం జరుగుతుంది. సంగారెడ్డి జిల్లాకు మరిన్ని పారిశ్రామిక పెట్టుబడులు తరలిరానున్నాయి. ఫార్మా కెమికల్స్, ఆటోమొబైల్, ఫుడ్ప్రాసెసింగ్, లైఫ్సైన్సెస్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకువస్తున్నారు.
– ప్రశాంత్కుమార్, జేడీ పరిశ్రమల శాఖ