సంగారెడ్డి అక్టోబర్ 1: సదాశివపేట పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం అవసరమైన నిధులు తీసుకొస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. గురువారం సదాశివపేటలో మంత్రి హరీశ్రావు పర్యటించారు. పట్టణంలో రూ.6.50 కోట్లతో నిర్మిస్తున్న సిద్దాపూర్ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. తర్వాత పట్టణంలో మిషన్ భగీరథ పథకంలో భాగంగా నిర్మించిన పంపుహౌజ్, సాయిబాబాకాలనీ, కృష్ణానగర్తోపాటు మరో రెండు కాలనీల్లో నిర్మించిన ట్యాంకులను మంత్రి ప్రారంభించారు. పట్టణంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 1692 మంది లబ్ధిదారులకు కొత్త పింఛన్ల కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ 57 ఏండ్లు దాటిన వారికి ఆసరా పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
దీంతో సంగారెడ్డి జిల్లాలో 5వేల మందికి కొత్త పింఛన్లు అందజేస్తున్నట్లు చెప్పారు. సదాశివపేట మండలంలో కొత్తగా 1692 మందికి పింఛన్లు అందజేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ పెద్ద కొడుకులా పేదలకు ఉచిత బియ్యం, ఆసరా పింఛన్ అందజేస్తున్నట్లు చెప్పారు. పొరుగునే ఉన్న బీదర్లో బీజేపీ ప్రభుత్వం ఉందని అక్కడ కేవలం రూ.600 పింఛన్ ఇస్తున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కోరిక మేరకు సదాశివపేట పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే లేనప్పటికీ సదాశివపేట అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పట్టణంలో రూ.110 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నామన్నారు. రూ.45 కోట్లతో మిషన్ భగీరథ కింద నిర్మించిన పంప్హౌజ్, ట్యాంకులను ప్రారంభించినట్లు చెప్పారు. పట్టణంలో పది వేల కొత్త నల్లా కనెక్షన్లు ప్రారంభించామన్నారు.
రూ.55 కోట్లతో పట్టణంలో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మించనున్నామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం సదాశివపేట అభివృద్ధికి ఒకేమారు రూ.110 కోట్ల నిధులు కేటాయించలేదన్నారు. సీఎం కేసీఆర్ కేటాయించారన్నారు. పట్టణంలోని ఊబ చెరువు సుందరీకరణ పనులను త్వరలోనే పూర్తిస్థాయిలో చేపడుతామన్నారు. మండలంలో ఎవరికైనా పింఛన్లు మంజూరు కాకపోతే త్వరలోనే గుర్తించి అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మిషన్ భగీరథ ట్యాంకుల ప్రారంభంతో పట్టణంలో ఇంటింటికీ తాగునీరు అందుతున్నదన్నారు. సదాశివపేట అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకొచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చిత్తశుద్ధితోకృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి, ఎమ్మెల్యే క్రాంతికిరణ్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, డీసీఎంఎస్చైర్మన్ శివకుమార్, కౌన్సిలర్లు, సదాశివపేట మున్సిపల్చైర్పర్సన్ పిల్లోడి జయమ్మ, వైస్ చైర్మన్ చింతా గోపాల్ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.