సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 12: తారా ప్రభుత్వ కళాశాలకు న్యాక్ ఏ గ్రేడ్ సాధించాలని ఉన్నత విద్యా సంయుక్త సంచాలకుడు డాక్టర్ రాజేందర్ సింగ్ ఆకాంక్షించారు. మంగళవారం స్థానిక తారా ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలను జేడీ సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ఏక్యూఆర్ నివేధికను జేడీకి సమర్పించారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులతో సమావేశమైన రాజేందర్సింగ్, రాష్ట్రంలో 11అటానమస్ కళాశాలలో తారా కళాశాలకు ప్రత్యేక గుర్తింపు ఉన్నదన్నారు. రాబోయే రోజుల్లో కళాశాలలో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు. డిగ్రీ నుంచే బాగా చదువుకొని పరిశోధన కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత యూపీఎస్సీ పోటీ పరీక్షల్లో మన రాష్ట్ర అభ్యర్థులు ఘన విజయాలు సాధిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. సమయాన్ని వృథా చేయకుండా ప్రణాళికతో చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. డిగ్రీ స్థాయి నుంచే లక్ష్యానికి బాటలు వేసుకొని ఆ దిశగా పట్టుదలతో కృషి చేయాలన్నారు. ముఖ్యంగా జాతీయ స్థాయిలోని 10టాప్ యూనివర్సిటీల్లో సీటు సంపాదించాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామీణ విద్యార్థులు అద్భుత విజయాలు సాధిస్తున్నారని అం దుకు నిదర్శనం ప్రభుత్వ కళాశాలల్లో చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉన్న తనలాంటి వారు చాలా మంది ఉన్నారన్నారు.
‘తారా‘ ఒక మినీ యూనివర్సిటీ
తారా కళాశాలలో దాదాపు 3500 మంది విద్యార్థు లు చదువుకోవడం సంతోషకరమని జేడీ పేర్కొన్నారు. తారా కళాశాలను మినీ యూనివర్సిటీగా అభివర్ణించారు. విద్యార్థులు తమ చదువులను మధ్యలోనే ఆపేయకుండా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత చదువులను కొనసాగించాలని సూచించారు. చదువుతో పాటు ఎన్ఎస్ఎస్, ఎన్సీసీల ద్వారా ఇక్కడి విద్యార్థులు అద్భుతాలు సాధిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు.
అందరూ సమన్వయంతో కృషి చేసి కళాశాలకు మెరుగైన గ్రేడ్ను సాధించాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలోనే తారా కళాశాలను ఒక రోల్ మోడల్గా నిలుపాలన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ, అధ్యాపక బృందంతో కలిసి జేడీ రాజేందర్సింగ్ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ ఉపేందర్, డాక్టర్ వెంకటేశం, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ఏవీ శర్మ, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.