పటాన్చెరు, మార్చి 28 : దళితుల జీవితాల్లో కొత్త కాం తికిరణం దళితబంధు అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని బచ్చుగూడెంలో దళితబంధుకు ఎంపికైన లబ్ధిదారుల యూనిట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. డెయిరీ యూనిట్ పెట్టుకుంటున్న నర్సింహులు వేయిస్తున్న షెడ్ పనులు, బోర్ బావిని ఎమ్మెల్యే ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దళితులు ఆర్థికంగా ఎదిగేలా దళితబంధు పథకం ప్రవేశపెట్టారన్నారు. పటాన్చెరు మండలంలోని బచ్చుగూడెంలో 39 యూనిట్లు, జిన్నారం మండలం కొడకంచిలో, గుమ్మడిదల మండలం అనంతారంలో దళితబంధు యూనిట్లు కేటాయిస్తున్నామన్నారు. బచ్చుగూడెంలో 16 యూనిట్లు పని ప్రారంభించాయని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలోనే ప్రభుత్వం కొత్త యూనిట్లు మంజూరు చేయనున్నదని చెప్పారు. అధికారుల శిక్షణ, ప్రజాప్రతినిధుల సహాయంతో కొత్త యూనిట్లు విజయవంతమయ్యేలా చూడాలన్నారు. దళితబంధు పథకాన్ని దళితులు సద్వినియోగం చేసుకుని నలుగురికి ఆదర్శంగా ఉండాలన్నారు.
సీఎం కేసీఆర్ సారు మంచి చేస్తుండు
సీఎం కేసీఆర్ సారు మాకు శాన మంచి చేస్తుండు. నేను పాల డెయిరీ పెడుతున్న. పొలంలో బోరు వేసుకుని బర్లను తెచ్చి పాల వ్యాపారం చేస్తా. పాల దందాలో నాకు అనుభవం ఉంది. నాకు ముగ్గురు ఆడబిడ్డలు. ఒకరి పెండ్లి చేసిన. నా భార్య అనిత కూడా సాయంగా ఉంటది. అందరూ నాకు ధైర్యం చెప్తున్నరు.
-నర్సింహులు, డెయిరీ యూనిట్ లబ్ధిదారుడు