Aasara Pensions | మునిపల్లి, మే 6: సమయానికి పింఛన్ అందక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోస్టల్ అధికారుల ద్వారా పెన్షన్లు ఇస్తుండటంతో గ్రామాల్లోకి వారు సమయానికి రావడం లేదు. వచ్చినా సరిపడా డబ్బులు లేకపోవడంతో అందరికీ పింఛన్లు అందజేయడం వీలుపడట్లేదు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో 30 గ్రామాలు ఉండగా.. ఏ ఒక్క గ్రామంలో కూడా పూర్తిగా పింఛన్ ఇవ్వకపోవడం గమనార్హం.
పింఛన్ అందకపోవడంపై మునిపల్లి మండలంలోని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తు్న్నారు. పోస్టల్ అధికారులు గ్రామాలకు వచ్చి టైమ్ గడిపి వెళ్తున్నారు తప్ప.. పింఛన్ ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు. పోస్టల్ అధికారులు ఎప్పుడు వస్తారో? ఎప్పుడు పోతారో సమాచారం ఉందడం లేదని అన్నారు. పింఛన్ పంపిణీలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నా పట్టించుకునే వారే కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డబ్బుల్లేవ్.. మేం ఏం చేయాలి?
ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదు.. మేం ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలని సంబంధిత పోస్టల్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే గ్రామాల్లో సమాచారం ఇవ్వకుండా.. లబ్ధిదారులు లేని సమయంలో అధికారులు వచ్చి పింఛన్లు పంచుతున్నారని.. అప్పుడు కూడా సిగ్నల్ రావడం లేదంటూ తప్పించుకుంటున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు.
పింఛన్ ఇచ్చినా.. పైన చిల్లర కట్!
ప్రభుత్వం అందించే పెన్షన్ రూ.2016 రూపాయలను లబ్ధిదారులకు పూర్తిగా ఇవ్వకుండా పోస్ట్ అధికారులు చిల్లర లేవు అనే సాకుతో లబ్ధిదారుల వద్ద పైన చిల్లర రూ.16 ఎగ్గొట్టేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పింఛన్ల పంపిణీలో ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో పోస్టల్ అధికారులే పింఛన్ డబ్బులను దోచుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, పింఛన్లను సక్రమంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.